గన్నవరం వైసీపీ వర్గపోరుకు జగన్ చెక్- చేతులు కలిపిన ఎమ్మెల్యే వంశీ, యార్గగడ్డ..
కృష్ణాజిల్లా గన్నవరంలో ఇవాళ ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గన్నవరం వైసీపీలో నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత, సీఎం జగన్ ఇవాళ ఓ ప్రయత్నం చేశారు. నియోజకవర్గం పరిధిలోని పునాదిపాడులో ఇవాళ నిర్వహించిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన ప్రత్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరినీ కలిపేందుకు జగన్ ప్రయత్నించారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ చేతిలో యార్లగడ్డ వెంకట్రావు 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అలాంటి తరుణంలో టీడీపీ నుంచి గెలిచిన వంశీని జిల్లా మంత్రులు కొడాలినాని, పేర్ని నాని సాయంతో జగన్ వైసీపీలోకి తీసుకొచ్చారు. జగన్ను కలిసిన తర్వాత టీడీపీపై నిప్పులు చెరుగుతూ ప్రభుత్వానికి అండగా వంశీ మాట్లాడుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో ప్రత్యర్ధిగా ఉన్న యార్గగడ్డతో పాటు మరో ప్రత్యర్ధి దుట్టా రామచంద్రరావు వర్గాన్ని దూరం పెడుతున్నారు. దీంతో ఈ ముగ్గురి మధ్య మూడు మక్కలాట కొనసాగుతోంది.
Recommended Video
ఈ నేపథ్యంలో గన్నవరంలోని పునాదిపాడు పాఠశాలకు విద్యాకానుక కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన జగన్.. వంశీ, యార్గగడ్డ ఇద్దరినీ పలుకరించారు. ఇద్దరినీ పరస్పరం షేక్ హ్యాండ్ ఇప్పించారు. విభేదాలు వీడి పార్టీ కోసం పనిచేయాలని ఇద్దరినీ కోరారు. జగన్ సమక్షంలోనే వంశీ, యార్గగడ్డ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే మరో నేత దుట్టా రామచంద్ర రావు మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.