రాజధాని అమరావతి వెనుక అసలు విషయాన్ని బయటపెట్టిన కేశినేని నాని
Kesineni Nani: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ లోక్సభ అభ్యర్థిగా ఎంపికైన కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్పై ఘాటు విమర్శలను గుప్పించారు. వారిద్దరి వైఖరిని ఎండగట్టారు.
విజయవాడ కేశినేని భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నాని. తన కొడుకు తన నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. ఈ క్రమంలో పొత్తు పార్టీని సైతం మోసగించడానికి వెనుకాడబోరని, కాపు సామాజిక వర్గం ఆశలను నిరాశ చేస్తాడని విమర్శించారు.

ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే- మిత్రధర్మాన్ని పాటిస్తూ పవన్ కల్యాణ్కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సి ఉంటుందని, చంద్రబాబు మాత్రం ఆ పని ఎప్పటికీ చేయబోడని కేశినేని అన్నారు. ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను చూడాలనేదే ఆయన కోరిక తప్ప పొత్తు పార్టీని గౌరవించాలనే యోచన ఆయనలో ఉండదని చెప్పారు.
అమరావతిని అభివృద్ధి చేస్తాననే భ్రమంలో ప్రజలను ఉంచాడని, ఈ క్రమంలో విజయవాడను ఓ స్మశానంలాగా చంద్రబాబు తయారు చేశాడని నాని ధ్వజమెత్తారు. విజయవాడ అంటే చంద్రబాబుకు ముందు నుంచీ చిన్నచూపేనని, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఓ ట్యాక్సీ డ్రైవర్ను అవమానించాడనే కోపంతో ఉన్నాడని విమర్శించారు.
టీడీపీలో ఉన్నన్ని రోజులు తాను అమరావతి రాజధానికి తాను వ్యతిరేకంగా లేనని వ్యాఖ్యానించారు. వారధి నుంచి కాజా వరకూ ఉన్న స్థలంలో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసి ఉండొచ్చని అన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఉండేదని కేశినేని నాని అన్నారు.
అలాగే- పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లాన్ను రూపొందించి ఉంటే అద్భుతమైన రాజధాని ఏర్పడి ఉండేదని కేశినేని అన్నారు. విజయవాడను అభివృద్ధి చేయకూడదనే కారణంతో కావాలనే ల్యాండ్ మాఫియాకు పాల్పడి, రైతులను మోసగించి 33 వేల ఎకరాలను సేకరించాడని విమర్శించారు.
అమరావతి రాజధాని అనేది 30 ఏళ్లయినా పూర్తి కాబోదని, తాను కొనకళ్ల నారాయణతో చెప్పానని కేశినేని నాని అన్నారు. కొంతమంది భూమాఫియా చేతుల్లోకి చంద్రబాబు వెళ్లిపోయాడని, రైతుల పొట్ట కొట్టడానికి కూడా వెనుకాడలేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు స్వార్థం కోసం ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
హైదరాబాద్ పాతబస్తీలాగా విజయవాడను తయారు చేయాలనేదే చంద్రబాబు ఉద్దేశమని మండిపడ్డారు. చంద్రబాబును రాజధాని ప్రాంతం, విజయవాడ ద్రోహిగా అభివర్ణించారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినన్ని నిధులను మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని కేశినేని అన్నారు.












Click it and Unblock the Notifications