విజయవాడపై కేశినేని, లింగమనేని పట్టు
AP Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో అటో ఇటో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి.
విజయవాడలో అన్ని పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- బీజేపీ మధ్యో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ వెళ్తోన్నారు. ఎన్నికల హామీలను గుర్తు చేశారు. తమ పార్టీకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తోన్నారు.

ఈ పరిస్థితుల్లో కేశినేని శ్వేత.. వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట లింగమనేని శివరామ ప్రసాద్ ఉన్నారు. వెల్లంపల్లికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఆయనతో కలిసి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కేశినేని, లింగమనేని కుటుంబాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంగా ఆ కుటుంబాలు తెలుగుదేశంలో పని చేసిన విషయం తెలిసిందే. అనంతరం వైఎస్ఆర్సీపీలో చేరాయి. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత.. టీడీపీకి గుడ్బై చెప్పారు.
లింగమనేని శివరామ ప్రసాద్ కూడా ఈ ఏడాది జనవరిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఏ పార్టీలో అధికారికంగా చేరనప్పటికీ- ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడ లోక్సభతో పాటు దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఈ రెండు కుటుంబాలు ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications