టీవీ9 దీప్తిపై భీకరదాడి.. ఇతర చానెళ్ల రిపోర్టర్లనూ తరిమికొట్టారు.. రైతుల ముసుగులో..
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నిరసన చేస్తున్న రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వార్తల కవరేజ్ కోసం వెళ్లిన టీవి9, మహా టివి, ఐ న్యూస్, ఎన్టివి ప్రతినిధుల్ని రక్తాలొచ్చేలా తరిమికొట్టారు. వాళ్లను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులనూ రైతులు వదల్లేదు. ఘటనలో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. ఈ అనూహ్య పరిణామంతో రాజధాని ప్రాంతంలో ఎన్నడూ లేనంత ఉద్రిక్తత నెలకొంది.
రాజధానిని కదిలిస్తే రాష్ట్రం అగ్నిగుండమే: కమిటీకి చట్టబద్ధత లేదు: టీడీపీ నేతల ఫైర్..!
అసలేం జరిగింది?
జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రపోజల్ ప్రకటించినప్పటి నుంచి అమరావతి రాజధాని ప్రాంతం రగిలిపోతోంది. రాజధానికి భూములిచ్చిన గ్రామాలరైతులందరూ ఎక్కడిక్కడ నిరసనలకు దిగారు. రైతుల పోరాటానికి పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. శుక్రవారం ఉద్దండరాయునిపాలెం వద్ద ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేపట్టారు. దాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో రైతులు వాగ్వాదానికి దిగారు. క్షణాల్లోనే గొడవ పెద్దదై దాడికి దారితీసింది.
దీప్తిని వెంటాడి.. కారులో బంధించి..
మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన రైతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం. రైతులు ముందుగా టీవీ9 రిపోర్టర్ దీప్తిపై దాడి చేశారు. మహిళా జర్నలిస్టుపై దాడి తగదంటూ ఎన్టీవీ రిపోర్టర్ హరీష్ వారించడంతో ఆయనపైనా పిడిగుద్దులు పడ్డాయి. సహచరుల్ని కాపాడుకోడానికి వచ్చిన మహాటీవీ రిపోర్టర్ వసంత్, ఐ న్యూస్ రిపోర్టర్ రామారావులనూ రైతులు తీవ్రంగా కొట్టారు. దాడి నుంచి తప్పించుకుని వెళ్లేక్రమంలో దీప్తిపై వెలగపూడి దగ్గర మరోసారి దాడి జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును చుట్టుముట్టిన ఆందోళనకారులు.. అద్దాలు పలగ్గొట్టి దీప్తిని లోపల బంధించారు. పగిలిపోయిన కారు అద్దాలు ఆమె శరీరంలోకి గుచ్చుకున్నట్లు తెలుస్తున్నది. రైతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహాటీవీ రిపోర్టర్ వసంత్ కు సచివాలయంలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో చికిత్స అందించారు.
రైతుల ముసుగులో బయటివాళ్లొచ్చారు: పోలీసులు
వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆందోళనకారులు దాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసుల వివరణ సంచలనం రేపుతున్నది. ఐజీ వినీత్ బ్రిజల్ మాట్లాడుతూ.. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడిలో మీడియాపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, రైతుల ముసుగులో కొంతమంది బయటి వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడిగా గుర్తించామని, బాధ్యులైనవాళ్లను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు.