జగన్పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్న వల్లభనేని వంశీ..!!
విజయవాడ: తెలుగుదేశం తిరుగుబాటు శాసన సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి తాను అన్ని విధాలుగా కష్టపడతానని, శాయశక్తులా ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందనీ తేల్చి చెప్పారు.
బాపులపాడులో..
ఇవ్వాళ ఆయన ఎన్టీఆర్ జిల్లాలోని బాపులపాడు మండలం వీరవల్లిలో పర్యటించారు. అక్కడి జెడ్పీ హైస్కూల్లో తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్ను ప్రారంభారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చదువుకునే సమయంలో ఇప్పుడు ఉన్నన్ని సౌకర్యాలు ఉండేవి కావని చెప్పారు.
విద్యావ్యవస్థలో..
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం- విద్యా వ్యవస్థలో అనేక మార్పులను తీసుకొచ్చిందని వల్లభనేని వంశీ అన్నారు. విద్యార్థులను బాగోగులను జగనే స్వయంగా చూస్తున్నారని చెప్పారు. నాడు-నేడు పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేయడానికి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తోన్నారని అన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను వల్లభనేని వంశీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నాణ్యమైన విద్య కోసం..
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే ఆహారాన్ని జగన్ స్వయంగా తానే పరిశీలించారని, ఆయన సెలెక్ట్ చేసిన మెనూనే మధ్యాహ్న భోజనంలో పెడుతున్నారని వంశీ చెప్పారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరినీ సమాన స్థాయికి తీసుకుని వచ్చేది ఒక్క విద్య మాత్రమేనని, నాణ్యమైన చదువులను చెప్పించడానికి జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్నటువంటి పథకాలు ఇదివరకు ఎప్పుడూ లేవని ఆయన స్పష్టం చేశారు.
జగన్ కోసం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత కూడా ఒక్క జగన్దేనని వంశీ చెప్పారు. ఇంగ్లీష్ మీడియం చదువుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉందని, ఆ మీడియంలో విద్యాబోధన అవసరం ఎంత ఉందో తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న ఈ సదుపాయాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యకు ఇంత ప్రాధాన్యత ఇస్తోన్న జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
చిత్తశుద్ధికి నిదర్శనం..
విద్యార్థులందరికీ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్, చివరి షూలను కూడా వైఎస్ జగన్ స్వయంగా ఎంపిక చేశారని వల్లభనేని వంశీ గుర్తు చేశారు. విద్యార్థుల పట్ల ఆయన చూపే శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 8వ తరగతి చదివే లక్షలాది మంది విద్యార్థులకు ట్యాబ్లను ప్రభుత్వం అందించిందని, ఏ ప్రభుత్వమైనా ఇంతకంటే ఎక్కువ చేయలేదని ఆయన అన్నారు. నాణ్యమైన విద్యను అందించాలనేది జగన్ ఉద్దేశమని చెప్పారు.