రంగా హత్య: తప్పుఅంగీకరించి టీడీపీపై వంగవీటి రాధాకృష్ణ కీలకవ్యాఖ్యలు, జర్నలిస్ట్లపై ఆగ్రహం
విజయవాడ: విజయవాడ సీనియర్ రాజకీయ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీకి సంబంధం అంశంపై ఆయన వ్యాఖ్యానించారు. తన తండ్రి హత్యకు టీడీపీకి ఏం సంబంధమన్నారు. అది కొందరు వ్యక్తుల పని అని చెప్పారు. రంగా హత్యనుటీడీపీకి ఆపాదించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రంగాను అభిమానించే వారు అన్ని పార్టీల్లో, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వనందుకు బాధ కాదని, అవమానించినందుకు బాధ అని చెప్పారు. మీడియా సమావేశంలో రెండుమూడుసార్లు రాధా సహనం కోల్పోయారు. జర్నలిస్ట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్ట్ల ఆగ్రహం
మీ ద్వారా మీ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలని టీడీపీ చూస్తోందని, అది టీడీపీ ఆలోచన అని, అందుకే మిమ్మల్ని ఆహ్వానించారని చాలామంది భావిస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి వంగవీటి రాధాకృష్ణ స్పందిస్తూ.. తన వెనుక ఉన్న వారిని చూపిస్తూ.. ఇక్కడ ఉన్నవాళ్లు అంతా కాపులేనా, ఇక్కడ ఉన్నవారు అందరూ కాపులేనా అన్నారు. దానికి ఓ జర్నలిస్ట్ స్పందిస్తూ.. ప్రశ్న అడిగితే బెదిరిస్తారా అన్నారు. జర్నలిస్టు క్వశ్చన్ అడిగితే బెదిరించడం ఏమిటన్నారు.
పెద్దమనిషివి అన్నావుగా.. అంత పనికిరాదు: పవన్ కళ్యాణ్కు టీజీ వెంకటేష్ కౌంటర్
లెట్ మి ఫినిష్ అంటూ గొంతు చించుకున్నారు
'లెట్ మి ఎక్స్ప్లేన్.. లెట్ మి ఫినిష్.. లెట్ ఫినిష్ డామిట్.. ఇదే చెప్పేది.. రంగా మీద ఓ కులం ముద్ర వేసి, ఆయనను అభిమానించే వారు ఇతర కుల్లాల్లో లేరా అని అడుగుతున్నాను నేను' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగాను అభిమానించే వాళ్లు ఇతర కులాల్లో లేరనుకుంటే అది మీ భ్రమ అన్నారు. అన్ని కులాలల్లో ఉన్నారని చెప్పారు. అన్ని మతాల వాళ్లు ఉన్నారని చెప్పారు. మీరు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం, కక్షలు సాధించాల్సిన అవసరం లేదని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానాలు, నిందలు భరించానని చెప్పారు. నిందలను ఒక కులానికి అంటగట్టవద్దన్నారు. వంగవీటి కుటుంబం పదిమందికి న్యాయం చేస్తుందని ఆహ్వానించారని చెప్పారు. ప్రతిది రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. అలా అయితే రాజకీయమే కనిపిస్తుందన్నారు. నాతో ఉండేవాళ్లు ఉంటారని, వారి కోసం కష్టపడతానని చెప్పారు.
హత్య ఘటనపై ఏమన్నారంటే
మీ నాన్న గారిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారని కొందరు అభిమానులు, అనుచరులు అడుగుతున్నారని, దానిపై ఏం సమాధానం చెబుతారని కొందరు జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనిపై వంగవీటి స్పందిస్తూ... తెలుగుదేశం నా తండ్రిని పొట్టన పెట్టుకుందని ఆవేశంలో మాట్లాడవచ్చునని, ఇటీవల చెప్పానని, ఓ విగ్రహావిష్కరణకు వెళ్తే అన్ని పార్టీల వారు వచ్చారని చెప్పారు.
అప్పుడే తనతో కొంతమంది చెప్పారని.. అన్నా, మీరు రాజకీయం కోసం అంటున్నారని, కొంతమంది వ్యక్తులు చేసిందని (హత్య), మా అందరికీ అంటగడితే ఎలాగని ప్రశ్నించారని చెప్పారు. దీనికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని అన్నారు. మీ నాయకుడి వద్ద మెప్పు పొందేందుకు మీరు అలా మాట్లాడి ఉండి ఉంటారని అన్నారు. అప్పుడు తనకు నిజమే అనిపించిందన్నారు.
ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, అక్కడ వేరే వాళ్లు లేరా అని అడిగితే, మీరు తలకాయ తీసుకొని ఎక్కడ పెడతారని అడిగారని, దాంతో తనకు బాధ అనిపించిందని, అప్పుడు నాకు బాధ అనిపించిందని, మా రాజకీయం కోసం అందర్నీ రెచ్చగొట్టడం సరికాదన్నారు. వ్యక్తులు చేసిన దానిని పార్టీకి పూసి, అలా వారిని కించపరిచామని, వాళ్లు (టీడీపీ) అడిగే వరకు తమకు తెలియరాలేదన్నారు. ఆయనను అభిమానించే వాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని మరిచిపోయామన్నారు.
అది తన పొరపాటు అని, దానిని అంగీకరిస్తున్నానని చెప్పారు. కొంతమంది చేసిన దానికి ప్రతి ఒక్కరిని బాధ్యులుగా చేయలేమని అభిప్రాయపడ్డారు. రంగాను టీడీపీ వాళ్లు కూడా అభిమానిస్తున్నారని చెప్పారు. వంగవీటి రంగా అభిమానులు, తన అనుచరులు వేరేలా అర్థం చేసుకోవద్దన్నారు.
ఏయ్ చెప్పేది విను.. నెత్తిన పెట్టుకుంటారు
టీడీపీతో రంగా ఆశయాలు నెరవేరుతాయని అనుకుంటున్నారా.. అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి వంగవీటి రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయ్.. నువ్వు తెలుగుదేశం అదే చెప్పింది.. నీవు ఏ టీవీ అయినా అయి ఉండవచ్చు, విను (లిజన్), నేను చెప్పాను... నీ టీఆర్పీ కోసం, మరో దాని కోసమో నేను మాట్లాడటం లేదని, ప్రజలు అభిమానంతో ముప్పయ్యేళ్లు మోశారని, రంగా ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజలు మోశారని, కాబట్టి ఆయన ఆశయాలు ఎవరు నెరవేరిస్తే వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని, వారు ఏ పార్టీ వారు అయినా సరే అన్నారు. కాగా, తాను టీడీపీలో చేరుతానని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కానీ ఆయన మాటలను బట్టి టీడీపీతో చేరుతారని తేలిపోయింది.