సరస్వతీ దేవిగా దుర్గమ్మ -వీఐపీ సిఫారసులు రద్దు : పోటెత్తిన భక్తులు..!!
విజయవాడ నగరంలోని రోడ్లన్నీ అమ్మవారి భక్తులతో రద్దీగా మారాయి. అన్ని దారులు ఇంద్రకీలాద్రికే అన్నట్లుగా తలపిస్తున్నాయి. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్య లో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. సరస్వతిదేవి దర్శనార్థం క్యూలైన్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు
తెల్లవారుజామున 2 గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించారు. మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా శక్తి రూపాలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. వీఐపీలకు , వృద్దులు , వికలాంగులు ప్రత్యేక దర్శనం ఇవ్వలేమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ వైపు వచ్చే అన్ని మార్గాలలో బారికేడ్లతో భారీ బందోబస్తు నిర్వహించారు. బస్టాండు నుంచి కాలినడకనే భక్తులను అనుమతి ఇస్తున్నారు. భక్తజనుల అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన జ్యోతి వెలిగించే జ్ఞాన ప్రదాయినీ సరస్వతి దేవిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలానక్ష్రత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. గత రెండేళ్లపాటు కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు దసరా వేళ అమ్మవారి ఆలయానికి రాగా.. ఈసారి కొవిడ్ ఆంక్షలు లేని సమయంలో సాధారణ రోజుల కంటే నాలుగింతలు అధికంగానే వచ్చే అవకాశం ఉంది. వీఐపీలతో సహా దివ్యాంగులు, వృద్ధులు కొండపైకి వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరినీ సర్వదర్శనాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు.
మూల నక్షత్రం నాడు..సరస్వతి దేవీ రూపంలో
ఇవాళ అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 5 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కంట్రోల్రూమ్, కుమ్మరిపాలెం నుంచి ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ఈవో భ్రమరాంబ ఉదయం నుంచి క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. కొండ పైకి దారి బయల్దేరే ప్రాంతం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలయానికి వచ్చిన సమయంలో మాత్రం అరగంట పాటు దర్శనం నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నారు. మూలా నక్షత్రం నాడు అమ్మవారి దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.