జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?
అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయని తేలింది. దీంతో హైదరాబాదులో పని చేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ పైన బదలీ వేటు వేశారు.
క్రిమినల్తో కాంటాక్టులో ఉన్నందుకు బదలీ వేటు వేశారు. మరో ఏసీపీపై మరింత లోతుగా విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశముంది.

వారి సాయంతో బయటపడవచ్చుననే ఏపీకి వెళ్లాడా?
రాకేష్ రెడ్డి ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు ఉపయోగించుకొని సెటిల్మెంట్లు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రాకేష్ రెడ్డి కుత్బుల్లాపూర్లోని సంజయ్గాంధీ నగర్కు చెందినవాడు. అతని సోదరుడు, సోదరి అమెరికాలో ఉన్నారు. పదో తరగతి వరకు చదివాడు. టీడీపీలో సాధారణ కార్యకర్తగా చేరి అనతి కాలంలోనే ప్రధాన నాయకులకు చేరువయ్యాడు. వారి పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడేవాడు. ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరించిన కేసులో కేసు కూడా నమోదయింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్లో విలాసవంతమైన మూడంతస్తుల బిల్డింగ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఏపీలో ఓ పార్టీకి చెందిన నేతతో, మరికొందరు నాయకులతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జయరాంను హత్య చేశాక వారి సహాయంతో బయపడవచ్చునని నందిగామ వద్ద వదిలేసినట్లుగా భావిస్తున్నారు. అందుకే హైదరాబాదులో చంపి, నందిగామ తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

వారి సూచన మేరకే ఏపీకి తరలింపు
జయరాంను హైదరాబాదులో హత్య చేసి కృష్ణా జిల్లాకు తరలించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తోంది. జయరాం హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. జయరాం హత్య తర్వాత ఆధారాలను మాయం చేయడంలో తెలంగాణకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సహకరించినట్లు కూడా విచారణలో తేలిందట. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్డేటాలో వీరి నెంబర్లు ఉన్నాయి. వారి సలహా ప్రకారం శవాన్ని ఏపీకి తరలించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడని తెలుస్తోంది. శవాన్ని మాయం చేసేందుకు తనతో సంబంధం ఉన్న ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వారి సూచనతో ఏపీకి తీసుకెళ్లాడని సమాచారం.

శిఖాచౌదరి ప్రమేయం లేదు!
హత్యలో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయం లేదని, అయితే జయరాంతో రాకేష్ రెడ్డి పరిచయానికి ఆమె కారణమని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. హత్యకు రాకేష్ రెడ్డితో పాటు మరో నలుగురు సహకరించారని తెలుస్తోంది. జయరాం, శిఖా చౌదరిలతో రాకేష్ రెడ్డిలకు ఓ కంపెనీ గొడవ విషయంలో పరిచయం ఏర్పడింది. తొలుత శిఖాతో పరిచయం కాగా.. ఆ తర్వాత జయరాంకు పరిచయం చేశారు. మరోవైపు, జయరాం హత్య కేసులో వీధి కుక్కలకు ఇచ్చే ఇంజక్షన్ వాడారని తొలుత వచ్చిన వార్తలు అవాస్తవమని తేలిందట. ముక్కు మూసి పిడిగుద్దులతో చనిపోయాడని గుర్తించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications