ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంతో ఏపీలో ఒకటే చర్చ .. బాబు గారి శాశ్వత నివాసం ఎక్కడ ?
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఒకపక్క కృష్ణానదీ కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది . ఇక అందులో భాగంగా ప్రజా వేదికను కూల్చివేస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రజావేదిక కూల్చివేత చంద్రబాబు నివాసానికి ఎసరు అన్న భావన వ్యక్తం అవుతూ ఉంది . ఇక ఈ నేపధ్యంలో అమరావతిలో శాశ్వత నివాసం కలిగి ఉండకపోవడం చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద తప్పు అని రాజకీయ వర్గాల్లోనూ ,అటు ప్రజల్లోనూ చంద్రబాబు నివాసం హాట్ టాపిక్ గా మారింది .
ఏపీలో జగన్ కు , పవన్ కు శాశ్వత నివాసం .. చంద్రబాబుకే లేదని పెద్ద చర్చ
ఏపీలో గతంలో ఏపీలో ఇల్లు కూడా లేదని అనేక సార్లు విమర్శలకు గురయ్యారు జగన్ మోహన్ రెడ్డి . ఈ నేపధ్యంలో జగన్ మరియు పవన్ కళ్యాణ్ ఏపీ లో శాశ్వత నివాసాలను కట్టుకున్నారు , చంద్రబాబు నాయుడు మాత్రం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో లీజుకు తీసుకున్న బంగ్లాలో ఉంటున్నారు.ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉన్న అదే ప్రాంగణంలో మరియు అతని బంగ్లాకు ఆనుకొని ఉన్న ప్రజా వేదికా భవనాన్ని కూల్చివేయాలని సిఎం జగన్ ఆదేశించటంతో తర్వాత లక్ష్యం చంద్రబాబు నాయుడు నివాసం అని స్పష్టంగా తెలుస్తుంది.ఏపీ రాజకీయాలు రోజురోజుకూ హాట్ హాట్ గా మారుతున్నాయి . టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును దెబ్బతీయడమే లక్ష్యంగా అధికార వైకాపా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తెలుగుదేశం హయాంలో నిర్మించిన ప్రజావేదికను కొత్త ప్రభుత్వం కూల్చి వేయాలని ఆదేశించింది . ప్రజావేదికను ప్రతిపక్షనేత హోదాలో తనకు కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి లేఖ రాసినా తిరస్కరించిన ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కూల్చివేయ్యలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక అక్రమ కట్టడాల తొలగింపు లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.
తెలంగాణా ప్రజల కమిట్మెంట్ ఆంధ్రా ప్రజలకు ఉంటే అది సాధ్యం .. ప్రత్యేక హోదాపై పవన్
చంద్రబాబు నివాసం ఖాళీ చేయించాలని కంకణం కట్టుకున్న వైసీపీ ..
చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు .ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు ఖాళీ చేయిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన నివాసం అక్రమ కట్టడమని ఆళ్ల వ్యాఖ్యానించారు. ఉండవల్లిలో కృష్ణా నదీ తీరం వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించేలా పోరాటం చేస్తామని ఆళ్ల స్పష్టం చేశారు. భవనాన్ని ధ్వంసం చేయడానికి కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. టీడీపీ అధినేత తన ఇంటిని ఖాళీ చేసే వరకూ వదలిపెట్టబోమని చెప్పారు. ఇక వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిని టార్గెట్ చెయ్యటంతో ఇప్పుడు చంద్రబాబు ఇంటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
చంద్రబాబు నివాసంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు
ఏ విధంగానైనా చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయించాలని అధికారపక్షం భావిస్తుండగా .. ఎలా ఖాళీ చేయిస్తారో చూస్తామంటూ ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ప్రతిసవాల్ విసురుతున్నారు. దీంతో ఈ వివాదం కాస్తా ఏపీ ప్రజల్లో హాట్ టాపిక్ అయ్యింది . నదీ పరీవాహక ప్రాంతాల్లో నివాసకట్టడాలు నిబంధనలకు విరుద్ధమని అధికారపక్ష నేతలు మాట్లాడుతుండగా, జగన్ తన మాటే తమ నేతల మాట అన్నట్టు వ్యవహరించటంతో చంద్రబాబు నివాసం కూడా ఖాళీ చేయిస్తారని చర్చ జరుగుతుంది. కొందరు మాజీ సీఎం కు ఇల్లు కూడా లేకుండా చేస్తారా అని చంద్రబాబుపై సానుభూతి చూపిస్తుంటే మరికొందరు అక్రమ కట్టడాలను కూల్చెయ్యాల్సిందే అని అంటున్నారు .
మకాం మార్చే యోచనలో చంద్రబాబు .. విజయవాడలో నివాసం కోసం ప్రయత్నాలు
ఇక ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ మకాం మార్చే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను విజయవాడ నుంచి నిర్వహిస్తామని ప్రకటించిన ఆయన, తాజాగా తమ నివాసాన్ని కూడా విజయవాడలోనే ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఉండేందుకు అనువైన నివాసం కోసం పార్టీ ముఖ్యనేతలు గాలిస్తున్నట్లుగా సమాచారం. జెడ్ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ఆయనకు అందుకు అనుగుణంగా ఉండే నివాసం కోసం పార్టీ వర్గాలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. విదేశీ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.