రేషన్ బియ్యానికి నగదు బదిలీ వాయిదా.. విపక్షాలపై మంత్రి కారుమూరి ఫైర్
రేషన్ బియ్యానికి నగదు బదిలీ అంశం ఏపీలో పోస్ట్ పోన్ అయ్యింది. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ప్రకటన చేశారు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని పక్కన పెట్టామని చెప్పారు. యాప్లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేశామని వివరించారు. నగదు బదిలీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. పేదల నగదు బదిలీ పథకంపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగదు బదిలీ ప్రారంభించాలని 2017లో కేంద్రం ప్రభుత్వం సూచించిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ఆదేశాలపై బీజేపీ విమర్శిచడం విడ్డూరంగా ఉందన్నారు. రేషన్ నగదు బదిలీ పథకాన్ని ముందు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తోన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో బలవంతం లేదని.. ఇష్టం ఉన్న వారికి డబ్బులు బదిలీ చేస్తారని చెప్పారు. ఇష్టం లేని వారికి బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు.
బియ్యానికి ఇచ్చే డబ్బుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో కేంద్రం సూచనలతో ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రేషన్కు సంబంధించి నిజమైన లబ్ధిదారులకు కార్డులు తొలగిస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. జూన్లో కొత్త కార్డులు మాత్రం ఇస్తామని తెలిపారు.
నగదు బదిలీ పథకాన్ని మే నెల నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంది. రేషన్ బియ్యం వద్దంటే కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా డబ్బులు వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ముందుగా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచన చేసింది. కొన్ని నెలల పాటు డబ్బులు తీసుకుని.. ఆ తర్వాత బియ్యం కావాలని అడిగినా తీసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది.
విశాఖ జీవీఎంసీ పరిధిలో గల అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. రేషన్ కార్డు దారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని భావించారు. ఈ పథకంతో ఇష్టం ఉన్న వారు బియ్యం తీసుకుంటారు. వద్దనుకుంటే నగదు తీసుకుంటారు. కానీ నగదుపై మాత్రం స్పష్టత లేదు.