అమరావతిలో టెన్షన్: చంద్రబాబు కాన్వాయ్ పైకి చెప్పులు: టీడీపీ..వైసీపీ వర్గాల ఘర్షణ..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తొలి సారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన ఖరారు అయిన రోజు నుండి రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అక్కడి రైతులు సైతం రెండుగా చీలారు. కొందరు దళిత రైతులు చంద్రబాబు గ్రాఫిక్స్ తో తమను మోసం చేసారని..రాజధానిలో పర్యటించాలంటే ముందుగా క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేసారు. ఇక, చంద్రబాబు రాజధానిలో పర్యటన ప్రారంభమైంది. ఇదే సమయంలో అనుకూల వర్గం నేతలు స్వాగతం లుకుతుండగా ...వ్యతిరేకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ మీదకు చెప్పులు..రాళ్లు వేసే ప్రయత్నం చేసారు. పోలీసులు రంగ ప్రవేశం చేసారు.
రాజధానిలో చంద్రబాబు పర్యటన నేడే .. రాజకీయవర్గాల్లో ఆసక్తి
చంద్రబాబు కాన్వాయ్ పైన రాళ్లు..చెప్పులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన పైన నాలుగు రోజులుగా రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. రాజధాని రైతులు రెండు వర్గాలుగా చీలి పోయి..చంద్రబాబుకు వ్యతిరేకంగా కొత్త డిమాండ్ల తెర మీదకు తెచ్చారు. దళితుల భూముల విషయంలో మోసం చేసారని..గ్రాఫిక్స్ తో మాయ చేసారంటూ కొందరు రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. అయితే, చంద్రబాబు కొద్ది సేపటి క్రితం రాజధానిలో పర్యటన ప్రారంభించారు. చంద్రబాబును రాకను స్వాగిస్తూ కొందరూ..వ్యతిరేకిస్తూ మరి కొందరు రెండు వర్గాలుగా చీలి పోయారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబుతో పాటుగా ఉన్న టీడీపీ నేతల కాన్వాయ్ మీదకు చెప్పులు..రాళ్లు విసిరే ప్రయత్నం చేసారు. పోలీసుల రంగం ప్రవేశం చేసి వారిని చెదర గొట్టారు.
కాన్వాయ ను అడ్డుకొనేందుకు ప్రయత్నం..
చంద్రబాబు వ్యతిరేక వర్గం ఆయన కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం చేసారు. దళిత రైతులకు క్షమాపణ చెప్పకుండా ముందుకు వెళ్లనీయమంటూ అడ్డుకొనేందుకు దూసుకు వచ్చారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు వారితో బాహాబాహీకి దిగారు. రెండు వర్గాలను పోలీసులు చెదర గొట్టారు. యాక్సెస్ రోడ్డు వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం నుండి పర్యటన ప్రారంభించాలని తొలుత భావించారు. ముందుగా ప్రభుత్వం కూల్చివేసిన ప్రజా వేదికను పరిశీలించారు. అయితే, చంద్రబాబు కాన్వాయ్ లో ఉన్న బస్సును అడ్డుకొనేందుకు ప్రయత్నం జరిగింది. రెండు వర్గాల రైతులు చంద్రబాబు అనుకూల..వ్యతిరేక నినాదాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు అడ్డు చెప్పకుండా..నిరసన కారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్ మీదకు రాళ్లు విసిరేందుకు ప్రయత్నం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ
చంద్రబాబు పర్యటన పైన ఇప్పటికే మంత్రులు బొత్సా వంటి వారు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా దీని పైన టీడీపీ సైతం తిప్పికొట్టింది. ఇక, చంద్రబాబు తన హాయంలో జరిగిన రాజధాని పనుల గురించి వివరించటానికి జాతీయ మీడియాను తన పర్యటనలో వెంట తీసుకెళ్తున్నారు. రాజధానిలో పనులు నిలిపివేసి..రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బ తీసారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.దీనిని నిరూపించేందుకే ఈ పర్యటన చేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు..అధికారుల నివాస సముదాయాలను పరిశీలించనున్నారు. దీని పైన ఇప్పటికే అసక్తి నెలకొని ఉండగా..తాజాగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులతో ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది.