జగన్ ప్రమాణ స్వీకారోత్సవ ఖర్చు రూ.29లక్షలు కాదా?: రూ. 5కోట్లా, మధ్యలో ‘సాక్షి’అంటూ టీడీపీ
అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంగు ఆర్భాటాలు లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారానికి కేవలం రూ. 29 లక్షలే ఖర్చయ్యాయని వైసీపీ నేతలు వెల్లడించారు. ఇంతకుముందు సీఎం చంద్రబాబులా దుబారా ఖర్చులు చేయలేదంటూ చురకలంటించారు.

మొత్తం ఖర్చు రూ. 5కోట్లట
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రూ. 29లక్షలు కాదని.. మొత్తం 5 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించింది. రూ. 29లక్షల మాత్రమే ఖర్చు అయ్యాయని వైసీపీ నేతల ప్రచారమే తప్ప.. అందులో వాస్తవం లేదంటూ మండిపడింది.

కేవలం ప్రకటనలకే..
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా తాము వివరాలు సేకరించామని.. అందులో కేవలం పత్రికా ప్రకటనలకే జగన్ సర్కారు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు తేలిందని టీడీపీ పేర్కొంది. ఈ మేరకు ఓ పట్టికను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఆర్టీఐ సమాచారం మేరకు..
తాము సమాచార హక్కు ద్వారా సేకరించిన వివరాల మేరకు.. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన పత్రిక ప్రకటనల కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ తెలిపింది. కేవలం 29 లక్షలతోనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైసీపీ చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది.
పత్రిక ప్రకటనలకు చేసిన ఖర్చులో అత్యధికంగా రూ. 2 కోట్ల మేర ప్రకటనలను సాక్షి పత్రికకే ఇచ్చారని ఆరోపించింది.

ఆరోపణల్లో వాస్తవం ఎంత?
అయితే, టీడీపీ ఆరోపణల్లో ఎంత వాస్తవముందో తెలియాల్సి ఉంది. ఈ ఆరోపణలపై వైసీపీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో వేచిచూడాలి. లోటు బడ్జెట్లో కొనసాగుతున్న రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆడంబరాలు లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనేది వైసీపీ నేతల వాదన. టీడీపీ హయాంలో అయిన చాలా దుబారా ఖర్చులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా వరకు తగ్గించిందని ఇప్పటికే వారంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా దుష్ప్రచారం దుమారం రేగుతున్న సమయంలో ఇప్పుడు ఈ అంశం రెండు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేపనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications