రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పై సీఎం జగన్ ప్రశంసలు - ఆత్మీయ సన్మానం..!!
రెండు రోజుల ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము పైన ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలు కురిపించారు. దేశంలో ప్రతి మహిళకూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదర్శనీయులని పేర్కొన్నారు. రాష్ట్రపతి హోదా లో తొలి సారి ముర్ముకు ఏపీకి వచ్చారు. రాష్ట్రపతికి సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌరసన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. గవర్నర్ తో పాటుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతిని సన్మానించారు.
రాష్ట్రపతి ఎదిగిన తీరు ప్రశంసనీయం
ఆత్మీయ సభలో సీఎం జగన్ ద్రౌపదీ ముర్ము ఎదిగిన తీరును ప్రశంసించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టం అన్నది ఈ దేశంలోనే ప్రతి ఒక్కరికీ కూడా గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తొలిసారిగా మన రాష్ట్రానికి వచ్చిన ముర్ముగారిని గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా ద్రౌపతి ముర్ముగారి ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శనీయమని సీఎం ప్రశంసించారు. రాజ్యాంగ పరంగా నిర్ధేశించిన అర్హతలు ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఈ దేశంలో ఎంతటి స్థానానికైనా చేరుకోగలరు అన్నదానికి ద్రౌపతి ముర్ముఒక గొప్ప ఉదాహరణగా దేశచరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతారన్నారు.
కష్టాలను చిరునవ్వుతో స్వీకరించారు
రాష్ట్రపతి తన జీవితంలో మీరు పడ్డ కష్టాలను చిరునవ్వుతోనే స్వీకరించి, సంకల్పంతో ముందుకు సాగిన తీరు ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఆదర్శనీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఒడిషాలో అత్యంత వెనుకబడి మయూరుభంజ్ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించి ప్రాధమిక విద్యను కూడా పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసారు. చదువుకోవాలి, చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించి భువనేశ్వర్ వెళ్లి అక్కడే బీఏ పూర్తి చేశారన్నారు. గ్రామానికి సంబంధించినంతవరకు కాలేజీ వరకు వెళ్లి డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ రాష్ట్రపతి కావడం అప్పట్లో ఓ విశేషంగా సీఎం వివరించారు.
ఏపీ ప్రజలు - ప్రభుత్వానికి అభినందనలు
తర్వాత ఇరిగేషన్ శాఖలో..తరువా విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అక్కడ నుంచి కౌన్సిలర్గానూ, తొలిసారిగా 2000 సంవత్సరంలో రాయరంగపూర్ అసెంబ్లీ స్ధానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తీరును సీఎం వివరించారు. 2015లో జార్ఖండ్ గవర్నర్గా నియమితులు కావడం... ఆ తర్వాత ఇప్పుడు మన దేశ రాష్ట్రపతిగా మన రాష్ట్రానికి తొలిసారిగా రావడం అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయమని చెప్పుకొచ్చారు. నిష్కళంకమైన రాజకీయ జీవితం..ఎదిగిన తీరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకూ ఆదర్శనీయమని సీఎం చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పటిష్టతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఈ దేశ ఖ్యాతిని మరింత పెంచడంలో దోహద పడతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేసారు. ఏపీ ప్రభుత్వానికి..ప్రజలకు రాష్ట్రపతి ధన్యవాదాలు చెప్పారు.