చంద్రబాబును వారే కోరుకుంటున్నారు: జాతీయ అధ్యక్షుడట అంటూ విజయసాయి సెటైర్లు
అమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇటీవల శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై రాష్ట్ర ప్రజలకు విసుగుతెప్పించిందని.. అందుకే తననే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది.

ఓర్వలేకనే ఇలా..
ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్ర ప్రజలు భారీ పరాజయాన్ని అంటగట్టినా చంద్రబాబులో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. తాజాగా విజయసాయి రెడ్డి కూడా రంగంలోకి దిగి చంద్రబాబుపై విమర్శలు దాడి చేశారు. జగన్ పాలనను చూసి ఓర్వలేకనే.. ఏం చేయాలో అర్థంగాక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

వారే నిన్ను కోరుకుంటున్నారు బాబూ..
‘మళ్లీ తనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు గారు కలవరిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమే. పోలైన ఓట్లలో ఒక శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
మీ జాబితా పెద్దదే బాబూ..
‘ఎయిర్ పోర్టులో చిరు తిండ్ల ఖర్చు 25 లక్షలు, ఒక్క రోజు ధర్నాకు 10 కోట్లు, టిటిడి నిధులు 5 కోట్లు, పోలవరం బస్సు యాత్రలకు 100 హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లు. హిమాలయన్ వాటర్. చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దది వస్తుంది. కొందరు పదవిలో ఉన్నది అనుభవించడానికే అనుకుంటారు' అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.

తననే కోరుకుంటున్నారంటూ చంద్రబాబు..
నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై విసుగొచ్చిందని.. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మళ్లీ తననే సీఎంగా కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి సర్కారు విధానాల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని, దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇసుకను ఉచితంగా ఇస్తామంటే విమర్శించారని అన్నారు. రాష్ట్రంలో బంగారమైనా దొరుకుతుందేమో గానీ.. ఇసుక మాత్రం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఇసుకాసురుడిగా మారిపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications