విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్నారా?: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి: ఆంక్షల అమలు
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు భయానకంగా వ్యాప్తి చెందుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు పెద్దగా ఫలించట్లేదు. ఆదివారం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 12,634 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 69 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్దారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే ఒకేరోజు 12 మంది మరణించారు.
Recommended Video
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల రాకపై ఆంక్షలను విధించింది. ఈ మేరకు దుర్గగుడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కనకదుర్గమ్మ అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలు, పంచ హారతులను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
అమ్మవారిని దర్శించడానికి వచ్చే భక్తులకు ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. అంతరాలయ దర్శనం పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటలు దాటిన తరువాత ఘాట్ రోడ్డు, మహామండపం మార్గాల మీదుగా భక్తులకు అనుమతి నిలిపివేశామని స్పష్టం చేశారు. దుర్గగుడిలో పని చేసే అర్చకులు, ఆలయ సిబ్బంది కోవిడ్ నిబంధనలు, ప్రొటోకాల్స్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అన్నారు.
కాగా- కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరోజే 641 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 58,819కి చేరుకున్నాయి. ఇందులో 51,401 మంది పేషెంట్లు కరోనా బారి నుంచి కోలుకుని, ఇళ్లకు వెళ్లారు. 746 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6,672గా నమోదైంది. తాజాగా బులెటిన్ ప్రకారం.. ఒక్కరోజులో ఈ ఒక్క జిల్లాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు.