విజయవాడలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే- రేపు నాన్ వెజ్ మార్కెట్లు బంద్...
ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే విజయవాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అంచనాలకు అందని విధంగా అంతు చిక్కని కారణాలతో విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో రేపు ఆదివారం మాంసాహార మార్కెట్లను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ప్రజలపై డ్రోన్లతో నిఘా కూడా పెంచనున్నారు
విజయవాడలో మార్కెట్లు బంద్..
విజయవాడలో కరోనా కేసుల సంఖ్య అంతు చిక్కని రీతిలో పెరిగిపోతోంది. చూస్తుండగానే ఇప్పటికే 90 శాతం విజయవాడ నగరం రెడ్ జోన్ల పరిధిలోకి వెళ్లిపోయింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రజలు రోడ్లపైకి రావడం, మార్కెట్లలో షాపింగ్ కు ఎగబడటం వంటి కారణాలతో కరోనా కేసుల సంఖ్య 60కి చేరుకుంది. దీంతో రేపు ఆదివారం మాంసాహార మార్కెట్లను మూసేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. వీఎంసీ చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు తెరవవద్దని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలపై మరింత నిఘా..

విజయవాడలో అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రజలపై మరిన్ని ఆంక్షలు, నిఘాపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇక డ్రోన్ కెమెరాల ద్వారా లాక్ డౌన్ ను పర్యవేక్షించాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా చేపట్టి తదనుగుణంగా కేసుల నమోదుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బెజవాడలో ఇప్పటికే 17 కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి. వీటిలో డ్రోన్ ద్వారా నిఘా పెంచనున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ నిఘాను మరింత పెంచనున్నారు.












Click it and Unblock the Notifications