ఆప్ఘనిస్తాన్ టూ విజయవాడ-9వేల కోట్ల హెరాయిన్-అసలు నిజం చెప్పిన బెజవాడ సీపీ
ఆప్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు వేల కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్ అక్రమంగా రవాణా అవుతుండగా.. అధికారులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హెరాయిన్ విలువ దాదాపు రూ.9 వేల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఏపీకి ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ రవాణా ఎందుకు జరుగుతోందన్న దానిపై చర్చ మొదలైంది. ఇదే అదనుగా విపక్ష టీడీపీ రంగంలోకి దిగి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది.
ఆప్ఘన్ నుంచి విజయవాడకు హెరాయిన్ భారీ ఎత్తున అక్రమ రవాణా జరుగుతుండగా అధికారులు పట్టుకున్నట్లు వచ్చిన వార్తలపై విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. ఆప్ఘన్ నుంచి విజయవాడకు హెరాయిన్ అక్రమ రవాణా కావడం లేదని, ఇది ఆప్ఘన్ నుంచి గుజరాత్ కు రవాణా అవుతుండగా.. దాన్ని అక్కడి ముంద్రా పోర్టులో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నట్లు సీపీ వెల్లడించారు. అయితే పట్టుకున్న సమయంలో విజయవాడకు చెందిన అశి ట్రేడర్స్ కంపెనీ పేరు ఉండటంతో అది విజయవాడకు రవాణా అవుతున్నట్లు అంతా పొరబాటు పడ్డారని ఆయన తెలిపారు.

విజయవాడకు చెందిన గోవిందరాజు దుర్గా పూర్ణ వైశాలి చెన్నైలో నివసిస్తున్నారు. ఆమె గతేడాది ఆగస్టులో జీఎస్టీ లైసెన్స్ తీసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి ఆమె ఎగుమతులు, దిగుమతుల కోసం లైసెన్స్ తీసుకున్నారు. మాచవరానికి చెందిన ఆమె భర్త సుధాకర్ తో కలిసి ఆమె ఉంటున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలో కూడా ఉండటం లేదు. కానీ తాజాగా హెరాయిన్ గా చెప్తున్నది టాల్కం పౌడర్ మాత్రమేనని, అది ఢిల్లీకి రవాణా అవుతుండగా పట్టుకున్నారని, అక్కడ విజయవాడ అడ్రస్ తప్ప నగరానికి ఎలాంటి సంబంధం లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. విజయవాడ అడ్రస్ తో లైసెన్స్ తీసుకున్న వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఆహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలో తనిఖీలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications