జగన్కు కన్నా సూటి ప్రశ్న : ఏడాది గడిచింది.. అయినా దానిపై ఎందుకు విచారణ జరిపించలేదు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలోనే పలు వివాదాస్పద అంశాలు కూడా చర్చల్లో నానుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఈసీ నియామకం విషయంలో హైకోర్టు తీర్పు,మండలి రద్దు వంటి అంశాల్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం తమ నిర్ణయాలను సమర్థించుకుంటుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఇది జగన్ నియంతృత్వం అని నిరూపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మరోసారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం(జూన్ 1) ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్ తక్షణమే తప్పుకోవాలి..
జగన్ ఏడాది పాలన ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని కన్నా విమర్శించారు. అప్రజాస్వామ్యం, అవినీతి, అనుభవరాహిత్యం, కక్ష సాధింపులు, అసమర్థత, అప్పులే ప్రాధాన్యంగా జగన్ ఏడాది పాలన సాగిందని ఆరోపించారు. 2019లో ప్రజలు జగన్ను నమ్మి అధికారం అప్పగించారని... కానీ ఈ ఏడాది కాలంలో ఆయన సలు రంగు బయటపడిందని అన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చలేని అసమర్థత కనబడుతోందని మండిపడ్డారు. మూడు రాజధానుల చుట్టూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో కొనసాగే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని.. ఆయన తక్షణమే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఏడాదిలో.. ఎందుకు నిరూపించలేదు..
చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అని గత ఐదేళ్లలో పుస్తకాలు ముద్రించి కేంద్రం చుట్టూ తిరిగిన జగన్.. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా... ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటే.. వైసీపీ ప్రభుత్వం వాటికి చట్టబద్దత కల్పించేలా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాల పైకి వదిలిందన్నారు. రాష్ట్రంలో అప్రజస్వామిక పాలన నడుస్తోందని... హైకోర్టు తీర్పులే ఇందుకు నిదర్శనమని అన్నారు. మండలిలో వైసీపీకి వ్యతిరేకంగా బిల్లు పెట్టి సెలెక్ట్ కమిటీకి పంపించినందుకు.. ఏకంగా మండలినే రద్దు చేయడం జగన్ అహంకారపూరిత ధోరణికి అద్దం పడుతోందన్నారు.

బీజేపీ పోరాట ఫలితంగానే...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే వైసీపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తుల అమ్మకంలో వెనక్కి తగ్గిందన్నారు. వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తోంది తప్ప.. రాష్ట్రంలో సుస్థిర అభివృద్దికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఏడాది కాలంలో ఒక్క పరిశ్రమనూ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులు,భయోత్పాతం సృష్టించి.. ఎన్నికల ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చారని అన్నారు. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి ఎన్నికల కమిషనర్గా నియమించాలని కన్నా డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్కు సైతం కులాన్ని ఆపాదించాలని చూడటం జగన్ అహంకారాన్ని బయటపెడుతోందన్నారు.












Click it and Unblock the Notifications