ఏపీలో స్ధానిక పోరు వాయిదా గడువు తగ్గుతుందా ! కేంద్రం జోక్యం కోరనున్న జగన్ ?
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటం వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపడేసింది. ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకున్న అభ్యర్ధులను అయితే భారీ షాక్ కు గురి చేసింది. అయితే ఎన్నికల పోరు వాయిదాను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఉదయాన్నే సీఎస్ నీలం సాహ్నీతో ఎన్నికల కమిషనర్ కు లేఖ రాయించింది. అదే సమయంలో ఈసీ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న సీఎం జగన్ ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం కోరే అవకాశాలున్నాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో మరోసారి ఆశలు చిగురించాయి.

ఏపీ స్ధానిక పోరు వాయిదా- జగన్
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అభ్యర్ధుల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ సర్కారు.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్ హరిచందన్ ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన సీఎం జగన్, ఆ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఈసీ తీరుపై నిప్పులు చెరిగారు. దీంతో స్ధానిక పోరులో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కేంద్రంతో సంబంధాలు- ఎన్నికలు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, దాన్ని నడుపుతున్న సీఎం జగన్ కూ ఈ మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు పెరిగాయి. దీంతో సీఎం జగన్ స్ధానిక ఎన్నికల పోరును వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం వద్దే తేల్చుకుంటారన్న ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని వైసీపీలోనూ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఏదో ఒకటి చేసి తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా జగన్ ప్రయత్నిస్తారనే ఆశలు అభ్యర్ధుల్లో మొదలయ్యాయి. దీంతో ఎన్నికల వాయిదా నిర్ణయం ఈసీ వెనక్కి తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

ఈసీ నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక ఎన్నికల వాయిదా తీసుకోవడం వెనుక కుట్ర ఉందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నా దీన్ని సవాలు చేస్తే అది న్యాయసమీక్షకు నిలబడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఈసీ ఓసారి నిర్ణయం తీసుకున్నాక దానిపై పునస్సమీక్ష చేసి వెనక్కి తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఎన్నికల వాయిదాకు ఎస్.ఈ.సీ చూపించిన కారణం కరోనా ప్రభావం. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే తిరిగి కరోనా లేదని నిరూపించాల్సి ఉంటుంది. అది జరిగే పని కాదు. అందుకే ఇప్పుడు ఎన్నికల వాయిదా నిర్ణయం అసాధ్యమే.

కేంద్రం జోక్యం చేసుకుంటే...
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదాను సీరియస్ గా తీసుకుంటున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ తన ముందున్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. అందులో కేంద్రం జోక్యం కోరడం ఒకటి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని ఎన్నికల ప్రక్రియను పునరుధ్ధరించాలని జగన్ కోరే అవకాశముంది. అదే జరిగితే జగన్ తో ఉన్న సత్సంబంధాల మేరకు ఎన్నికల వాయిదా గడువును తగ్గించే అవకాశాలూ లేకపోలేదు. ఆరు వారాల ప్రక్రియను రెండు వారాలకు కుదించినా అది అంతిమంగా వైసీపీకి మేలు చేసేదే. దీంతో జగన్ కేంద్రం తలుపు తడతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications