ఓట్ల లెక్కింపులో కలకలం: 29 మంది కౌంటింగ్ ఏజెంట్లకు కరోనా పాజిటివ్, ఐసోలేషన్కు తరలింపు
అమరావతి: విశాఖపట్నం జిల్లాలో మరోసారి కరోనావైరస్ కలకలం రేపింది. ఆదివారం జరగనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న కౌంటింగ్ ఏజెంట్లు కరోనా బారిన పడ్డారు. 90 మంది కౌంటింగ్ ఏజెంట్లకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా బారినపడినవారిని వెంటనే ఐసొలేషన్కు తరలించాలని విశాఖ జేసీ ఆదేశించారు.
రెండు డోసుల టీకా తీసుకున్న వారినే కౌంటింగ్ ఏజెంట్లుగా తీసుకుంటామని జేసీ వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ ఏంజెట్లుగా అనుమతిస్తున్నామని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈనేపథ్యంలో కౌంటింగ్ ఏజెంట్లకు కొవిడ్ టెస్టులు చేయడంతో కరోనా కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరంగా మారింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ క్రమంలో పిటిషనర్లు.. ఎన్నికల సంఘం తరపున లాయర్ల వాదనలు విన్న బెంచ్ సింగిల్ జడ్జ్ తీర్పును రద్దు చేస్తూ ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇచ్చింది. కోర్టు నుంచి క్లియరెన్స్ రావటంతో ఎన్నికల సంఘం ఆదివారం పరిషత్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం చేసింది. ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్ధానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది మార్చి7న ఎన్నికల నిర్వహణ చేపట్టారు. మొత్తం 9672 స్ధానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 2371 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. అభ్యర్ధుల మృతితో మరో 81 స్ధానాల్లో పోలింగ్ నిలిచిపోయింది.
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,525 నమూనాలను పరీక్షించగా.. 1174 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1174 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,37,353కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు మరణించగా, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,061కి పెరిగింది.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1309 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,08,639కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 14,653 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,74,13,209 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 208 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 05 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 18, చిత్తూరులో 159, తూర్పుగోదావరిలో 208, గుంటూరులో 131, కడపలో 69, కృష్ణాలో 140, కర్నూలులో 05, నెల్లూరులో 122, ప్రకాశంలో 161, శ్రీకాకుళంలో 16, విశాఖపట్నంలో 55, విజయనగరంలో 10, పశ్చిమగోదావరిలో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,89,005, చిత్తూరులో 2,41,855 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,660) కరోనా కేసులున్నాయి.
దేశంలోనూ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, 35వేల ఎగువకు కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకముందు రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగాయి. అయితే, కొత్త కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 14.48 లక్షల మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 35,662 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.34 కోట్లకు చేరింది. కరోనా బారిన పడి మరో 281 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన సంఖ్య 4,44,529కు చేరింది. మరోవైపు, శుక్రవారం 33వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.26కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3.4 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.65 శాతానికి చేరింది. కాగా కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 23 వేలకుగా కరోనా కేసులు నమోదు కాగా, 131 మరణాలు సంభవించాయి. మరోవైపు, మహారాష్ట్రలో 3586 మంది కరోనా బారినపడ్డారు. కాగా, శుక్రవారం ఒక్కరోజే ప్రధాని నరేంద్ర మోడీని పుట్టిన రోజును పురస్కరించుకుని 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.42 కోట్లకు చేరింది.