atchannaidu: 10 మంది కార్యకర్తలను నిలువరించని 300 మంది పోలీసులు, పులివెందుల రౌడీలే..
పులివెందుల రౌడీలే చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై దాడి చేశారని మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కోడిగుడ్లు, టమాటలతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. 10 మంది వైసీపీ కార్యకర్తలను 300 మందికిపైగా ఉన్న పోలీసులు నిలువరించకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రశాంతతకు మారుపేరైనా విశాఖలో కూడా పులివెందుల మార్క్ రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

భయమెందుకు..?
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పర్యటనకు ఎందుకు అడ్డుకున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జిల్లాలో వైసీపీ నేతలు చేసిన భూకబ్జాలు గుట్టు బయటపడుతుందని భయపడ్డారా అని నిలదీశారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు దాడి చేయరని.. ఇదీ పులివెందుల మార్క్ రౌడీల పని అని ఆయన ఆరోపించారు. విశాఖపట్టణంలో జరిగిన భూకబ్జాలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే అవినీతి జరిగిందని అనుకోవాల్సి వస్తోందని స్పష్టంచేశారు.

అప్పుడు తరిమివేసి...?
వైజాగ్కు వచ్చే పెట్టుబడులను తరిమివేసింది వైసీపీ నేతలు కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడితే నవ్వొస్తోందని తెలిపారు. అమరావతిలో ఎంపీకి పూలు ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే నాన్ బెయిలబుల్ కేసు ఎందుకు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు. ఇదేం వివక్ష అని దుయ్యబట్టారు.

పులివెందుల పంచాయతీ..
విశాఖను కూడా పులివెందుల పంచాయతీగా మార్చాలని జగన్ అనుకొంటున్నారని అని ప్రశ్నించారు. ఎయిర్పోర్టుకు ముందుగానే పులివెందుల రౌడీలు, వైసీపీ కార్యకర్తలను తరలించి ప్రతిపక్ష నేతపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. వారంతా కోడిగుడ్లు, టమోటాలను సిద్ధం చేసుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

భూ అక్రమాలు..
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై దాడి చేయడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని పేర్కొన్నారు. వైజాగ్లో జరిగిన భూ అక్రమాలను ప్రజల ముందు ఉంచేవరకు తాము పోరాడుతామని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలను ప్రజల కళ్లకు కడుతామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications