హత్తుకునేలా ‘నాకు అడిగే హక్కుంది’: ఆలోచింపజేస్తున్న జనసేన పాట (వీడియో)
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సర్కారు విధానాల వల్ల ఇసుక దొరక్క సుమారు 30 లక్షల మంది కార్మికులు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఆయన ఈ భారీ నిరసనకు పిలుపునిచ్చారు.
ఆలోచింపజేస్తున్న పాట..
ఈ నేపథ్యంలో ప్రజల బాధలను, కష్టాలను వివరిస్తూ ఆలోచింపజేసేలా ఉన్న ఒక పాటను విడుదల చేసింది జనసేన. సమాజంలోని అన్ని వర్గాల పేద, సామాన్య ప్రజల బాధలు, కష్టాలను ఈ పాటలో కళ్లకు కట్టడం గమనార్హం. నాకు అడిగి హక్కుంది అంటూ సాగే ఈ పాట ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

నాకు అడిగే హక్కుందని..
నా కలలకు అడిగే హక్కుంది.. ఇది ఎందకు ఇన్నాళ్లైనా కలగానే ఇక మిగిలిందేనా
నా చేతికి అడిగే హక్కుంది.. చేసేందుకు పనిలేదని.. చెంతకు పనిరాదనే అని..
నా కళ్లకు అడిగే హక్కుంది.. మైళ్లకు మైళ్లే నడవాలని.. మా ఊళ్లకు బస్సేలేదని..
నా ఆకలికడిగే హక్కుంది.. గిడ్డంగులు నిండున్నామరి.. గింజైనా తను తినలేనని..
నా అవ్వకు అడిగే హక్కుంది.. తన అడుగుకు మందుందని.. వైద్యానికి దారేదని..
నా పల్లెకు అడిగే హక్కుంది.. రాత్రికి కరెంటు లేదని.. రేషన్ కూడా రాదని..
నా ఓటుకు అడిగే హక్కుంది.. ఒక రోజే హామీలన్నీ.. ఏ పని జరగదు ఐదేళ్లకీ..
నా జన్మకు అడిగే హక్కుంది.. ఎలాంటి హక్కు లేకుండా జీవించు......
అంటూ అర్థవంతంగా సాగిందీపాట.

అందుకే విశాఖ లాంగ్ మార్చ్..
కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కాబట్టి ఇసుక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందనుకుంటే నెలల తరబడి కార్మికులకు ఉపాధి లేకుండా పోయినా పట్టించుకోవడం లేదని.. వారి వెతలు అందరికీ అర్థం అయ్యేలా వచ్చే నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేపట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నాయకులతో బుధవారం రాత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లాంగ్ మార్చ్ నిర్వహణపై చర్చించారు. అన్ని పార్టీల అగ్రనేతలను కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. భవన కార్మికులకు మద్దతుగా అంతా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications