విశాఖ కాబోయే పరిపాలన రాజధాని మాత్రమే కాదు- అంతకుమించి..!!
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ- దూకుడును పెంచింది. కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తోంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయాత్తమౌతోంది. మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ అప్పట్లో సభలో ప్రకటించారు వైఎస్ జగన్. దీనికి అనుగుణంగా కార్యాచరణలోకి దిగారు.
యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోన్న మోదీ - శాటిలైట్ ఫొటోలతో బట్టబయలు
ఈ సాగర నగరాన్ని కేవలం కార్యనిర్వాహక / పరిపాలన రాజధానిగా మాత్రమే కాదు.. అంతకుమించి- అనే స్థాయిలో తీర్చిదిద్దడానికి వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాపిటల్ సిటీగా మార్చబోతోంది. రాష్ట్రానికి రాబోయే ఐటీ కంపెనీలన్నింటికీ విశాఖ-భీమిలీ-భోగాపురం పరిసర ప్రాంతాలను కేంద్రబిందువుగా మార్చనుంది. దీనికోసం ఐటీ/ఇండస్ట్రీయల్ క్లస్టర్ను ప్రకటించనుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తరువాత..డెంకాడ, ఆనందపురం, భీమిలీ పరిసర ప్రాంతాలు ఐటీ/ఇండస్ట్రీయల్ క్లస్టర్గా అభివృద్ధి చెందేలా ప్రణాళికలను రూపొందించింది ప్రభుత్వం. మూడు నుంచి మూడున్నరేళ్లలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ లోగా ఆరులేన్ల రహదారిని పూర్తిచేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని క్లస్టర్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ పరిణామాల మధ్య విశాఖపట్నానికి మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఐటీ హబ్గా మారుతున్న విశాఖపట్నంలో అమెజాన్ సంస్థ తన డెవలప్మెంట్, ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదిన ఏర్పాట్లు చేస్తోంది. ఫెసిలిటీ సెంటర్ కోసం 184.12 కోట్ల రూపాయల పెట్టుబడిని తొలిదశలో పెట్టనుంది. అనంతరం దీన్ని దశలవారీగా విస్తరించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
ఈ మేరకు అమెజాన్ సంస్థ సాఫ్టవేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియాకు ధరఖాస్తు చేసుకుంది. కొత్త సంవత్సరంలో ఈ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. ఈ విషయాన్ని ఎస్టీపీఐ తెలిపింది. డెవలప్మెంట్ సెంటర్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కండ్యూయెంట్, మిరాకిల్ సిటీ వంటి సంస్థలు అక్కడే ఏర్పాటయ్యాయి.