దేనికైనా సిద్ధం
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో నెలరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి మార్చి రెండో వారంలో షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవంక.. తెలుగుదేశం- జనసేన కూటమి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మరోవంక- ఈ ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నాయి.

వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. నేడో, రేపో అయిదో జాబితా వెలువడనుంది.
అటు తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రా..కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తి స్థాయి ప్రచారానికి దిగింది. నియోజకవర్గాలవారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోన్నాయి ఈ రెండు పార్టీలు.
ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. శనివారం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సిద్ధం అని నామకరణం చేశారు.
మధ్యాహ్నం 1:45 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం భీమిలీకి బయలుదేరి వెళ్తారు జగన్. ఆ నియోజకవర్గం పరిధిలోని తంగివలసకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉత్తరాంధ్ర రీజియన్ నాయకులతో సమావేశమౌతారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.
సిద్ధం పేరుతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ. ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులే గీటురాయిగా ఎన్నికలను ఎదుర్కొనడానికి సిద్ధం అయ్యామనే సందేశాన్ని పంపించింది.












Click it and Unblock the Notifications