విశాఖకు రాజధాని తరలింపుపై జగన్ కొత్త ప్లాన్ ఇదే..రేపు ఉద్యోగుల భేటీలో కీలక నిర్ణయం..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు ఆరువారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ఆగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విశాఖకు పంపాలనుకున్న సచివాలయ ఉద్యోగులను ప్రస్తుతానికి ఆన్ డ్యూటీ ద్వారా పంపాలని భావిస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇవ్వడంతో వారు తుది నిర్ణయం తీసుకునేందుకు రేపు సమావేశమవుతున్నారు.
Recommended Video

స్ధానిక పోరు వాయిదా- రాజధాని
ఏపీలో స్ధానిక ఎన్నికల ప్రక్రియను ఎట్టి పరిస్దితుల్లోుూ ఈ నెలాఖరులోపు పూర్తి చేసి, చివరి మూడు రోజుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలని, ఆ తర్వాత రాజధాని తరలింపు ప్రక్రియ మొదలుపెట్టాలని జగన్ సర్కారు భావించింది. అయితే స్ధానిక ఎన్నికల ప్రక్రియ కాస్తా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఆరువారాలు వాయిదా పడటంతో ఇక రాజధాని తరలింపు కూడా మూలనపడినట్లేనన్న వాదన వినిపించింది. అయితే రాజధాని తరలింపు ప్రక్రియ ఆగిపోవడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

ఆన్ డ్యూటీ పేరుతో తరలింపు..
వచ్చే నెలలో విశాఖ రాజధానికి తరలింపు ప్రక్రియ ప్రారంభించకపోతే ఆ తర్వాత ఇబ్బందులు తప్పకపోవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఆన్ డ్యూటీ ఇచ్చి మరీ కొందరు కీలక శాఖల ఉద్యోగులను విశాఖ పంపాలని పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగసంఘాలకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాధారణ తరలింపుకు అయితే జీవోల జారీతో పాటు ఇతర ప్రక్రియ అంతా చేపట్టాల్సి ఉంటుంది. అదే ఆన్ డ్యూటీపై పంపొద్దని చెప్పడానికి నిబంధనలు ఏవీ లేవు. దీంతో ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఉద్యోగసంఘాలు ఏమంటున్నాయి ?
వచ్చేనెలలో కచ్చితంగా విశాఖ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటంతో ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆన్ డ్యూటీ రూపంలో తమ ముందుకు రావడంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. విశాఖకు పూర్తిస్ధాయిలో తరలిస్తే ఓకే కానీ ఇలా ఆన్ డ్యూటీ పేరుతో వెళ్లమంటే తమకు సమస్యలు తప్పవని ఉద్యోగులు భావిస్తున్నారు. అందుకే ఉన్నతాధికారుల నుంచి ఈ మేరకు అందుతున్న సంకేతాలపై సమగ్రంగా చర్చించాకే నిర్ణయం చెప్పాలని వారు భావిస్తున్నారు.

రేపు ఉద్యోగసంఘాల కీలక భేటీ..
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదా, ఇతర పరిణామాల నేపథ్యంలో విశాఖకు వెళ్లే ఉద్యోగులను ఆన్ డ్యూటీ ఇచ్చి పంపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రేపు సచివాలయ ఉద్యోగ సంఘాల భేటీలో దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలతో పాటు తమకు అందిన డిమాండ్లను కూడా ఇందులో చర్చిస్తారు. ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకుని సీఎం నీలం సాహ్నీకి ఓ నివేదిక రూపంలో అందించే అవకాశం ఉంది. దీని ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications