మంత్రి పదవికి శ్రవణ్ రాజీనామా : లోకేశ్తో మంతనాలు..సీఎం కార్యాలయానికి లేఖ..!
ఎన్నికల ఫలితాల ముందు ఏపీ మంత్రి రాజీనామా చేసారు. మంత్రిగా ఆరు నెలల పాటు కొనసాగిన కిడారి శ్రవణ్ తన పదవికి రాజీనామా చేస్తూ సీఎం కార్యాలయంలో తన లేఖను అందచేసారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కు కృతజ్ఞతలు చెబుతూనే..బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తాను రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.
లోకేశ్తో మంతనాలు..
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోగా ఏదైనా చట్ట సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా..ఏ సభలోనూ అవకాశం రాకపోవటంతో మంత్రి పదవికి వైద్య..గిరిజన శాఖా మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేసారు. గత ఏడాది నవంబర్ 11న చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కిడారి శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 10వ తేదీతో ఆరు నెలల కాలం ముగుస్తుంది. దీంతో..గవర్నర నరసింహన్ సూచన మేరకు శ్రవణ్ను రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ అధికారులు సూచించారు. దీంతో అమరావతి చేరుకున్న శ్రవణ్ నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి లోకేశ్తో సమావేశమయ్యారు. రాజీనామా అంశం పైన చర్చించారు. రాజ్యాంగ బద్దంగా నడచుకోవాల్సిన బాధ్యత ఉందంటూ తాను రాజీనామా చేస్తున్న విషయాన్ని వివరించారు.

సీఎం కార్యాలయానికి లేఖ..
లోకేశ్తో మంతనాలు పూర్తయిన తరువాత శ్రవణ్ నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. లోకేశ్తో మంతనాల సమయంలో రాజకీయ భవిష్యత్ పైన శ్రవణ్కు లోకేశ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత నేరుగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్ చందర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందించారు. ఆరు నెలల పాటు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి..సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేది టిడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications