ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఇక తాడోపేడో..! ఉద్యోగుల జేఏసీ కీలక ప్రకటన..!
ఏపీఎస్ ఆర్టీసీలో (APSRTC) విద్యుత్ బస్సుల కొనుగోలు, ప్రైవేటు సంస్థలకు డిపోల లీజు ద్వారా జరుగుతున్న ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ఓ దశ ఆందోళనలు విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగుల జేఏసీ ఇప్పుడు రెండో దశ ఉద్యమానికి సిదమవుతోంది. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాలు ఉపసహరించుకోకపోతే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించింది.
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో దశ ఉద్యమానికి జేఏసీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28న ఏపిపిటిడి (ఆర్టీసి) ఉద్యోగసంఘాల జేఏసి రాష్ట్ర సమావేశం నిర్వహించబోతోంది. ఈ మేరకు రెండో దశ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ఆర్టీసి జేఏసి ప్రకటించనుంది. ఆర్టీసిలో ప్రైవేట్ విద్యుత్ బస్సుల ప్రవేశానికి తాము వ్యతిరేకమని, అలాగే ఆర్టీసి డిపోలు, ఆస్తులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు విరమించుకోవాలని జేఏసీ నేతలు కోరుతున్నారు.

పిటిడి (ఆర్టీసి) ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే తాము నిర్వహించిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని, అందుకే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే కార్యాచరణపై 28న కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. ఆర్టీసి పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధనకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది.












Click it and Unblock the Notifications