120 ఎకరాలేనట.. బుద్ద భూమిపై ఏపీ సర్కార్ ప్రకటన.. 3 వేలకు పైగా ఎకరాల్లో..?
ప్రభుత్వాలు మారితే విధానాల్లో మార్పు వస్తోంది. ప్రాజెక్టుల తీరే మారుతోంది. ఏపీలో కూడా అలాగే జరుగుతోంది. తొట్లకొండపై గల బుద్ధిస్టు కాంప్లెక్స్కు కేవలం 120.88 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వం అంటోంది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలనీ ప్రకటన కూడా విడుదల చేసింది. రెండు నెలల్లో అభ్యంతరాలను రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీకి చెప్పొచ్చు అని సూచించింది. లేదంటే దానిని ఖరారు చేస్తామని.. మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపడతామని వివరించింది.
314 స.నెలో 3 వేల ఎకరాలు
విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలం కాపులుప్పాడ గ్రామ సర్వే నంబర్ 314లో మొత్తం 3,143.40 ఎకరాలు ఉన్నాయి. ఇదీ బుద్ధిస్ట్ ప్రాంతమని సామాజికవేత్తలు అంటున్నారు. కొండ ప్రాంతం కావడం, అక్కడ నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తున్నారు. దీంతో కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫిల్మ్నగర్ క్లబ్కు తొట్లకొండ బుద్ధిస్టు మ్యూజియానికి సమీపాన 15 ఎకరాలు కేటాయించారు. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్టే విధించింది. ఇటీవల ఫిల్మ్నగర్ క్లబ్ కార్యవర్గాన్ని అధికార పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి బృందం బయటకు పంపి, తమ వారితో కార్యవర్గం ఏర్పాటుచేసుకుంది. వారి కుటుంబ సభ్యులే జీవితకాలం అందులో ఉండేలా బైలాస్ మార్చడానికి ప్రయత్నించారు. క్లబ్కు ఇప్పటివరకు సొంత స్థలం కూడా లేదు. గత ప్రభుత్వం కేటాయించినా అందులో పనులు చేపట్టకూడదని ఆంక్షలు విధించారు.
కానీ 120 ఎకరాలేనట..
తొట్లకొండలో పురావస్తు శాఖకు చెందిన స్థలం కేవలం 120.88 ఎకరాలేనని, మిగిలినదంతా వేరే స్థలమని పాత రికార్డులు తీశారు. అందులో నిర్మాణాలకు ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రకటన వెలువడిందని భావిస్తున్నారు. ఇదే ఉత్తర్వుల్లో ఫిల్మ్నగర్ క్లబ్కు తొట్లకొండ వద్ద కేటాయించిన 15 ఎకరాలు బుద్ధిస్టు కాంప్లెక్స్ స్థలానికి ఆవల ఉందని, అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని విశాఖపట్నం చీఫ్ అర్బన్ ప్లానర్ పేర్కొన్నారని ఇదే ప్రకటనలో వివరించారు. ఏపీ టూరిజం డెవల్పమెంట్ కార్పొరేషన్ ఇక్కడ 'స్వదేశ్ దర్శన్' పథకం కింద చేపట్టడానికి నిర్ణయించిన అభివృద్ధి పనులు కూడా అభ్యంతరం కిందకు రావని పేర్కొంది.
ఫిల్మ్నగర్ క్లబ్, ఏపీటీడీసీ పనులు..
తొట్లకొండ పురావస్తు శాఖ స్థలం 120.88 ఎకరాలను కాపులుప్పాడ సర్వే నంబరు 314 నుంచి మినహాయించి నోటిఫికేషన్ ఇచ్చి గెజిట్గా మార్చిన తరువాతే ఆ చుట్టుపక్కల స్థలాల్లో ఫిల్మ్నగర్ క్లబ్ గానీ, ఏపీటీడీసీ గానీ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అంతవరకు ముందుకు వెళ్లకూడదని పేర్కొంది. ఈ ప్రకటన జారీచేసి ఇప్పటికే నెల రోజులు అయింది. ఇంకో నెల రోజులు చూసి బుద్ధిస్టు కాంప్లెక్స్ను తొట్లకొండ నుంచి విభజిస్తారు. ఆ తరువాత మిగిలిన ప్రాంతంలో నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయం నిబంధనలకు విరుద్ధం అని.. బుద్ధిస్టు కేంద్రాన్ని పరిరక్షించుకోడానికి న్యాయస్థానంలో పోరాడతామని బుద్ధిస్టు మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ చెబుతున్నారు.