ఆ నియోజకవర్గంలో సైకిల్ జోరు... బ్రేకులు వేయడానికి అవకాశం కోసం చూస్తున్న YCP
ఒకే ఒక్క నియోజకవర్గం.. గతంలో కాంగ్రెస్ పార్టీని కలవరపరిచింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ నియోజకర్గంలో గెలవాలని పార్టీ పెట్టినప్పనుంచి వైసీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ గెలుపు జెండా ఎగరవేయలేకపోతోంది. ప్రతిసారీ ప్రతి ఎన్నికల్లో సైకిల్ జోరు ముందు ఎవరూ నిలవలేకపోతున్నారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఫ్యాన్ గిరగిరా తిరగాల్సిందేనే పట్టుదలతో అవకాశం కోసం ఆ పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు.

టీడీపీకి పెట్టని కోట.. విశాఖ తూర్పు
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిది. అన్ని వార్డుల్లోను నాయకులు, కార్యకర్తలతో పటిష్టమైన యంత్రాంగం ఉంది. వెలగపూడి రామకృష్ణబాబు వరుసగా 2009 నుంచి విజయకేతనం ఎగరవేస్తున్నారు. ఒకరకంగా వైసీపీ ఆవిర్భావం నుంచి రెండు ఎన్నికలు జరగ్గా ఆ పార్టీలో నెలకొన్న వర్గపోరే టీడీపీని గెలిపిస్తుందని భావించవచ్చు. మూడు గ్రూపులు, ఆరు తగాదాలతో వైసీపీ సతమతమవుతోంది.

కార్యాలయం ధ్వంసం చేసిన వంశీ అనుచరులు
ఇక్కడి నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన వంశీకృష్ణ యాదవ్ ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయనకే సీటు అనుకున్నప్పటికీ భీమిలీ నియోజకవర్గం నుంచి వచ్చిన విజయనిర్మలకు కేటాయించారు. ఆ సమయంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని వంశీ వర్గీయులు ధ్వంసం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్నికల్లో వంశీ పనిచేయలేదని, వారి ఓట్లు పార్టీకి పడలేదని విజయనిర్మల ముఖ్యమంత్రి జగన్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నుంచి ఇరువర్గాలు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నాయి. తర్వాత వంశీకి ఎమ్మెల్సీ ఇచ్చారు. నిర్మలకు వీఎమ్మార్డీయే చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు. తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి విశాఖపట్నం మేయర్గా గొలగాని హరివెంకటకుమారి ఎన్నికయ్యారు.

నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజయనిర్మల
ప్రస్తుతానికి విజయనిర్మల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆమెకే సీటు కేటాయిస్తారనే ప్రచారం నడుస్తోంది. మేయర్ వెంకటకుమారి కూడా ఇక్కడి నుంచి పోటీచేయడానికి ప్రయత్నిస్తున్నారు. వంశీ ఎలాగూ సిద్ధంగానే ఉన్నారు. మూడుగా చీలిపోయిన వైసీపీ క్యాడర్వల్ల తెలుగుదేశం పని సులువవుతోంది. అధిష్టానం దృష్టిపెట్టి గ్రూపు తగాదాలను నివారించి ఈసారి ఎలాగైనా వైసీపీ జెండాను రెపరెపలాడేలా చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
దీంతో వైసీపీ క్యాడర్ ఇక్కడ మూడుగా చీలిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగ్గురూ ఎవరి మటుకు వారు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఎవరి దారి వారిదే ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లుగా తూర్పు నియోజకవర్గం మారింది. దీంతో కార్యకర్తలు ఎవరితో ఉండాలి ఏం చేయాలీ అన్నది తెలియక అయోమయం అవుతున్నారు.












Click it and Unblock the Notifications