షాకింగ్: విశాఖలో మరో గ్యాస్ లీక్ -పరుగులు తీసిన స్థానికులు -పరవాడ పరిధిలో అర్ధరాత్రి ఘటన
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో మరో పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలోని ఓ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించి స్థానికుల కథనాలతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు, సమాచారం సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వివరాల ప్రకారం..
Recommended Video
విశాఖ జిల్లా, పరవాడ పారిశ్రామిక ప్రాంతంలోని భరణికం గ్రామ పరధిలో గల అనన్య అమ్మోనియా కంపెనీలో ఆదివారం(మే 23) రాత్రి గ్యాస్ లీకైనట్లు సమాచారం. ట్యాంకర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో పైప్ లైన్ లో గ్యాస్ లీకైంది. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే లీకేజీని అరికట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గ్యాస్ లీకైనట్లు గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు..

అమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్ల కళ్ళు మంటలు, శరీరంపై మంటగా అనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్యాస్ లీకేజీపై ఆందోళన చెందిన గ్రామస్తులు.. సంస్థను మూసేయాలంటూ అనన్య కంపెనీ ఎదుట అదే రాత్రి ధర్నా చెప్పారు. అయితే, ఆ సమయానికి కంపెనీ అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో దీనిపై పోలీసులతో చర్చించిన గ్రామస్థులు తిరిగి వెళ్లిపోయారు.

గ్యాస్ లీకేజీ తర్వాత జనం ఇళ్ల నుంచి బయటికి రావడం, అనన్య అమ్మోనియా కంపెనీ వద్ద ఆందోళనకు దిగడం లాంటి దృశ్యాలు, వాటి తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగంగానీ, అనన్య అమ్మోనియా సంస్థగానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. సరిగ్గా ఏడాది కిందట విశాఖ శివారులోని వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకై 15 మంది మృతి విషయం తెలిసిందే. నాటి అనుభవం రీత్యా ఆదివారం నాటి లీకేజీ ప్రజల్ని మరింత భయపెట్టింది.












Click it and Unblock the Notifications