విశాఖలో ఫీవర్ సర్వే.. H3N2పై అనుమానం?
కరోనా తర్వాత ఏ చిన్న దగ్గు వచ్చినా, జలుబు చేసినా అది కూడా ఒక వైరస్ అనే అనుమానం ప్రజలందరిలో నెలకొంది.
కరోనా తర్వాత ఏ చిన్న దగ్గు వచ్చినా, జలుబు చేసినా అది కూడా ఒక వైరస్ అనే అనుమానం ప్రజలందరిలో నెలకొంది. సాధ్యమైనంత మేర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నంలో కొత్త వైరస్ పంజా విసురుతోంది. ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు శ్వాసకోశ ఇబ్బందులతోపాటు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. సాధారణజలుబు, దగ్గులాంటివి రెండు మూడురోజుల్లో తగ్గుముఖం పడతాయి. ప్రస్తుత ఫ్లూ మాత్రం రెండు వారాలైనా తగ్గడంలేదు.

2 నెలల నుంచి H3N2
రెండు నెలల నుంచి H3N2 దేశమంతటా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంతోపాటు నిరంతరం దగ్గు రావడం, కొందరిలో శ్వాసకోశ సమస్యలు కనపడటం ప్రధానమైనవని చెబుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరిరు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్యను కూడా లెక్కిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జ్వరంతోపాటు విరేచనాలవుతోంటే వెంటనే వైద్యులను కలవాలని సూచిస్తున్నారు.

మాస్క్ ధరించాలి
నోటిని మాస్క్ తో కప్పుకోవడం మంచిదని, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, రోగ నిరోధకశక్తి పెరిగితే వైరస్ లను ఎదుర్కొనే వీలుంటుందని, అంతేకాకుండా గోరువెచ్చని నీరు, వేడి వేడిగా తాజా ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యశాఖాధికారులు ప్రతి సచివాలయం పరిధిలో ప్రజల ఆరోగ్యస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు వెల్లడించారు. ప్రజలంతా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యుల సూచనలు పొందాలని చెబుతున్నారు.

మందుల కొరత లేదు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎటువంటి మందుల కొరత లేదని, అన్ని కేంద్రాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచారు. ప్రజలంతా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటే చాలని అధికారులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు సాధారణ రోజులకంటే వారంరోజులపాటు ఉంటే భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉంటూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications