సిబ్బందికి జీతం ఇవ్వమని అడిగితే కేసు కట్టారు.. అశోక గజపతిరాజు ఫైర్
ఏపీ సర్కార్/ అధికారులపై మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక గజపతిరాజు మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయనకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. సర్కార్తో వివాదం చెలరేగడంతో.. చైర్మన్ పదవీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. తర్వాత సంచయిత మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా వ్యవహరించారు. చివరికీ అశోకకు అనుకూలంగా తీర్పు రావడంతో.. పదవీ బాధ్యతల బదిలీ తప్పలేదు.
అయితే జగన్ సర్కార్పై అశోక ఫైరయ్యారు. ప్రభుత్వాలు అన్ని మతాలను గౌరవించాలన్నారు. డబ్బు ఉండి కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం దారుణమయిన పరిస్థితి అని వివరించారు. మాన్సాస్ సిబ్బందికి జీతాలివ్వాలని కోరితే తనపై ఓ ఈవో కేసు పెట్టారని గుర్తుచేశారు. తాను కోర్టుకు వెళ్తే జీతాలు ఇవ్వమన్నారు..కానీ ఈవోపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భూ అక్రమాలపై సర్వేలతో సహా ఇవ్వమని అడిగానని.. కానీ ఇవ్వలేదని చెప్పారు. తనపై ఓ సీక్రేట్ రీసెర్చ్ జరుగుతోందని ఆరోపించారు.
వాహన మిత్ర కార్యక్రమానికి దేవాదాయ నిధులు వాడటం సరికాదు అని అశోక్గజపతి అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. 150కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇదీ దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. రామతీర్థం ఘటనపై యాక్షన్ తీసుకోకుండా రాజకీయం చేశారని మండిపడ్డారు. తాను కెమెరాలు పెట్టలేదని పదవీ నుంచి తొలగించారని గుర్తుచేశారు. దేవాలయాలు డబ్బులు ప్రభుత్వం తీసుకుని.. తనను పెట్టమంటే ఏం న్యాయమని ప్రశ్నించారు. కొందరు తనను జైలుకు పంపాలని చుస్తున్నారని అశోక్గజపతిరాజు అనుమానం వ్యక్తం చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ కింద విద్యాసంస్థలు, ఉద్యోగులు ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు అని గతంలో అశోక గజపతిరాజు ఆరోపించారు. ట్రస్టుకు హుండీలు లేవు అని.. రూ.124 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని.. మరీ జీతాలు చెల్లించడంలో ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. తండ్రి పీవీజీ రాజు ప్రజలను విద్యావంతులను చేయాలని భావించారని.. అందుకే విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని వివరించారు. కానీ ప్రస్తుతం జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీనిపై ఇవాళ మరోసారి ఆయన ప్రశ్నించారు.