అరకులోయలో పర్యాటకుల బస్సులో చెలరేగిన మంటలు - తప్పిన ముప్పు
పాడేరు: అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. పర్యాటకులతో వెళ్తోన్న బస్సులో మంటలు చెలరేగాయి. దీన్ని సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. పర్యాటకులందరూ సురక్షితంగా తప్పించుకోగలిగారు. వారంతా విజయనగరం జిల్లాకు చెందిన పర్యాటకులు. ఈ ఘటనలో బస్సు, పర్యాటకుల లగేజీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో విజయనగరం జిల్లా చెల్లూరుకు చెందిన 24 మంది స్థానికులు అరకులోయ, బొర్రా గుహలను చూడ్డానికి బయలుదేరారు. ప్రత్యేకంగా బస్సును అద్దెకు తీసుకున్నారు. అరకులోయలో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనంతరం స్వగ్రామానికి తిరుగుముఖం పట్టారు. మార్గమధ్యలో అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది.
ఘాట్ రోడ్ రెండో మలుపు దాటిన కొద్ది సేపటికే బస్సు టైర్ల నుంచి మంటలు చెలరేగాయి. వెనుక వైపు ఉన్న టైర్ల వీల్ డ్రమ్స్ వేడెక్కి మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ దీన్ని సకాలంలో గుర్తించాడు. పర్యాటకులను అప్రమత్తం చేశాడు. ఆ సమయంలో బస్సులో 24 మంది పర్యాటకులు నిద్రావస్థలో ఉన్నారు. మంటలు బస్సు మొత్తం వ్యాపించే సమయానికి వారంతా కిందికి దిగిపోయారు. క్షణాల్లోనే అగ్ని కీలలు వ్యాపించాయి.
బస్సు మొత్తం దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే శృంగవరపు కోటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు మొత్తం దగ్ధమైంది. పర్యాటకుల లగేజీ సైతం కాలిబూడిదయింది. పోలీసులు మరో వాహనాన్ని ఏర్పాటు చేయడంతో పర్యాటకులు గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఘాట్ రోడ్డు కావడం వల్ల టైర్లు తీవ్ర రాపిడి, ఒత్తిడికి గురికావడం, బ్రేక్ బ్లాక్ కావడం వంటి సందర్భాల్లో వీల్ డ్రమ్స్ వేడెక్కి ఇలా టైర్లు కాలిపోతుంటాయని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తోన్నారు.