విశాఖ వైసీపీలో విషాదం: కొత్తగా ఎన్నికైన జీవీఎంసీ కార్పొరేటర్ సూర్యకుమారి హఠాన్మరణం
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ హఠాన్మరణంతో గ్రేటర్ విశాఖలో విషాదం అలముకుంది. జీవీఎంసీ 61వ డివిజన్ కార్పొరేటర్ దాడి సూర్య కుమారి ఆకస్మికంగా మృతిచెందారు. విశాఖ పారిశ్రామిక వాడలో కుటుంబంతో కలిసుంటోన్న ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో సూర్య కుమారి ఇంటికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 10న జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో దాడి సూర్యకుమారి వైసీపీ తరఫున 61వ డివిజన్ నుంచి గెలుపొందారు. ఆమె మృతితో విశాఖ పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.

జీవీఎంసీ 61వ వార్డ్ కార్పొరేటర్ దాడి సూర్యకుమారి గారి ఆకస్మిక మృతి బాధాకరమని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ఒక ప్రకటన చేశారు.

మొత్తం 98 డివిజన్లున్న జీవీఎంసీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 58 స్థానాలను, టీడీపీ 30, జనసేన పార్టీ 3, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. గొలగాని హరివెంకట కుమారి మేయర్ గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్ సూర్యకుమారి మృతిపై మేయర్, ఇతర సభ్యులూ సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications