మృత్యుంజయురాలు: కరోనా మహమ్మారిని జయించిన నెల రోజుల పసికందు
విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ లక్షలాది మంది ప్రజల ప్రాణాలు తీస్తున్నా.. ఆ మహమ్మారిని జయించినవారి సంఖ్య కోట్లాలో ఉండటం గమనార్హం. వైద్యులు అందిస్తున్న వైద్యం, కరోనాను ఎదుర్కొగలమన్న ధైర్యంతో ఆ మహమ్మారి బారినుంచి సురక్షితంగా బయటపడుతున్నారు. తాజాగా, విశాఖపట్నంలో నెల రోజుల పసికందును కరోనా జయించి మృత్యుంజయురాలిగా నిలిచింది.
ఆ పసికందుకు చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ సాయి సునీల్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక నడుపూరు ప్రాంతానికి చెందిన ఆకులు ప్రశాంతి(31) ఏప్రిల్ 27న స్థానిక ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప పుట్టిన నాటి నుంచీ శ్వాసకోశ సమస్యతో బాధపడుతోంది. తొమ్మిదో రోజుకు తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఈ క్రమంలో విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు సాయి సునీల్ కిశోర్ ఆ పసికందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత న్యూమోనియా కూడా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పాపను ఎన్ఐసీయూలో ఉంచారు. హైప్రెజర్తో కూడిన మెకానికల్ వెంటిలేషన్ అందించారు.
24 గంటలపాటు ఐసోలేటెడ్ గదిలో వెంటిలేటర్ కేర్ అందించారు. ఐవీ రెమిడిసివిర్ ఐదురోజులపాటు ఇచ్చారు. ఆ పసికందు ఊపరితిత్తులు ఇన్ఫమేషన్కు గురయ్యాయని గుర్తించి.. ఐవీ స్టెరాయిడ్స్ ఐదు రోజులపాటు అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఏడు రోజుల తర్వాత మెకానికల్ వెంటిలేషన్ తొలగించారు. ఆ పసికందు వయస్సు ఇప్పుడు 35 రోజులే కావడం గమనార్హం. సోమవారం డిశ్చార్జ్ చేసిన వైద్యులు.. ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కూతురు ప్రాణాలు కాపాడిన వైద్యులు కిషోర్కు ఆ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.