మాటలు మార్చే చంద్రబాబును చూడండి, అవినీతి, పాపం చేసే మీరు భయపడతారు: విశాఖలో మోడీ
విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నంలో బీజేపీ సత్యమేవ జయతే పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా నిప్పులు చెరిగారు. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తర్జుమా చేశారు. ఈ సందర్భంగా ప్రారంభంలో మోడీ తెలుగులో మాట్లాడారు. విశాఖను చూస్తే మనసు పులకరిస్తోందని, తాము ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ తెలుగులో చెప్పారు. మొత్తం దాదాపు 40 సెకన్ల పాటు తెలుగులో మాట్లాడారు. సింహాచలం అప్పన్న స్వామి ఆశీస్సులు మీకు ఉన్నాయన్నారు.
ఇక్కడి నేతలు తప్పు చేస్తున్నారు
మీకు దశాబ్దాల నాటి కలను నెరవేర్చామని ప్రధాని మోడీ చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల అని, దానిని ఇప్పుడు తాము ఇచ్చామన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ బాగా అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు. రైల్వే జోన్ వల్ల ఈ ప్రాంతం పురోగమిస్తుందన్నారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. ఇక్కడి నేతలు తప్పు చేశారని, అందుకే తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అవినీతి చేస్తేనే భయపడతారు
ఎవరైతే అవినీతి, అక్రమాలకు పాల్పడతారో వారే నిత్యం భయపడతారని ప్రధాని మోడీ.. చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. మాది అంతా పారదర్శక పాలన అని, అందుకే దేనికీ భయపడమని చెప్పారు. తాము అంకితభావంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇక్కడి నేతలు ప్రతిసారి యూటర్న్ తీసుకుంటున్నారని చెప్పారు. ఇక్కడి నాయకులు అనేక అవినీతి పనులు చేశారని చెప్పారు. ఇక్కడి పాలకులు కుటుంబ పాలనను వ్యవస్థీకృతం చేశారన్నారు. ఈ నేతలు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మోడీని తిడుతున్నారన్నారు.
పాపాలు చేసిన వాళ్లే భయపడతారు
పాపాలు చేసిన వాళ్లే భయపడతారని, తాను భయపడనని మోడీ చెప్పారు. నీతి, నిజాయితీగా పని చేస్తే ఇక్కడి నేతలు భయపడాల్సినపని లేదని చెప్పారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కొందరు తనను తిడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు అనైతిక రాజకీయాలు చేస్తున్నారన్నారు. కూటములు కడుతూ ఎలాంటి అజెండా లేకుండా వారు జనం ముందుకు వస్తున్నారని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అన్నారు. కేవలం బీజేపీని దెబ్బకొట్టేందుకు కూటములు కడుతున్నారని మండిపడ్డారు. అనైతిక పొత్తులు సుస్థిర పాలనను అందించలేవన్నారు.
నరేంద్ర మోడీ విశాఖ పర్యటన: యూటర్న్, పుల్వామా ఘటన: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోడీ
మాటలు మార్చే చంద్రబాబును చూడండి
ఇక్కడి నేతలు ఎలాంటి వారితో కూటమి కట్టారో గ్రహించాలని మోడీ.. కాంగ్రెస్, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు. పలుమార్లు మాటలు మార్చే నేతల వైఖరిని గమనించాలని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కూటమి కట్టిన నేతలకు అజెండా లేదన్నారు. నల్లధనం దాచుకున్న వారిపై చర్యలు తీసుకోవడం వీరి బాధకు కారణమని చెప్పారు. మోడీ ఉంటే వీరి అక్రమాలు, ఆటలు సాగవనేది వారి ఆందోళన అన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే అవినీతి నేతల ఆటలు కూడా సాగవని చెప్పారు. చంద్రబాబు ప్రతిసారి యూటర్న్ తీసుకుంటున్నారన్నారు. ఈ నేతలు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. భావసారూప్యత లేని పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు.