చంద్రబాబు! అశోక్ గజపతిలా కాదనుకుంటా, మా ఫ్యామిలీ వ్యవహారాల్లో వద్దు: సంచైత కౌంటర్
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్, మన్సాస్ ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గజపతి వంశస్థుల హక్కులు కాపాడాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చిన్నాన్న, టీడీపీ నేత అశోక్ గజపతిరాజులానే చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయం చేయొద్దు..
గజపతి వంశానికి చట్టబద్ధ వారసుడైన ఆనంద గజపతి రాజుకి తాను వారసురాలిని అన్న విషయన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు సంచయిత.
తమ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి, ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదని ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలంటించారు.

చంద్రబాబూ మీకు అదే మంచిది.. సంచయిత స్ట్రాంగ్ కౌంటర్
‘నేను సంచయిత గజపతి రాజు. మా తాత మహారాజా పీవీజీ రాజు పెద్ద కుమారుడు, చట్టబద్ధమైన వారసుడైన నా తండ్రి ఆనంద గజపతికి చట్టబద్ధమైన వారసురాలిని. అశోక్ గజపతిలా చంద్రబాబు కూడా లింగ వివక్ష చూపించరని భావిస్తున్నా. గజపతి వంశానికి తానొక్కడినే వారసుడినని, నేను అనే వ్యక్తిని లేను అన్నట్లుగా అశోక్ గజపతి రాజు మిమ్మల్ని తప్పుదోవ పట్టించారనుకుంటున్నా. మీరు గజపతి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రతీది రాజకీయం చేయొద్దు' అని చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

గజపతి కుటుంబ హక్కులకు పూర్తి సంరక్షణ
సింహాచలం, మన్సాస్ బోర్డు చైర్ పర్సన్గా తన నియామకం జరిగినందుకు గజపతి కుటుంబ హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని, పూర్తిగా సంరక్షించబడుతున్నాయని సంచయిత స్పష్టం చేశారు. ఏపీలో సింహాచలం బోర్డ్, మాన్సాస్ ట్రస్ట్ సంరక్షకులుగా గజపతి కుటుంబీకుల హక్కులను కాపాడాల్సి ఉందని, ఈ విషయంలో సీఎం జగన్ డర్టీ పాలిటిక్స్ మానుకోవాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో సంచయిత ఈ మేరకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. కాగా, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ బోర్డు ఛైర్ పర్సన్గా సంచయితను నియమించిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మితోపాటు ఇదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి మాన్సాస్ ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించింది వైసీపీ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications