బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్.. మంత్రి కిడారికి భద్రత పెంపు
Recommended Video
అమరావతి : ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు భద్రత మరింత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గన్మెన్లకు తోడు అదనంగా ఆక్టోపస్ కమాండోల సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. ఇకపై కిడారి ఎక్కడికి వెళ్లినా.. ఈ కమాండోలు ఆయన వెంట ఉంటారు. కిడారి సొంత జిల్లా విశాఖతో పాటు విశాఖ ఏజెన్సీలో పర్యటించే సందర్భాల్లో సెక్యూరిటీ మరింత పెంచింది ఏపీ సర్కార్. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మరో రెండు కార్ల కాన్వాయ్ ను సిద్ధం చేసింది.
అంతేగాకుండా ఆయన సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ను నియమించింది. ప్రతి రోజు ఆయన వెంటే ఉండేలా ఏర్పాట్లు చేసింది. విశాఖతో పాటు ఏజెన్సీలో కిడారి ఎక్కడకు వెళ్లినా.. ఆయనతో పాటే ఈ సెక్యూరిటీ అధికారి వెళుతుంటారు.
సెప్టెంబర్ నెలలో విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ను మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో కొన్నాళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న మావోల కార్యకలాపాలు మళ్లీ విజృంభిస్తున్నాయని భావించి నష్ట నివారణ చర్యలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. అందులోభాగంగానే మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు భద్రత మరింత పెంచినట్లు సమాచారం.