జగన్ దృష్టిలో గంటా శ్రీనివాస్: రాజీనామా చేసిన మరుసటి రోజే అనూహ్యం: ఆహ్వానం..థ్యాంక్స్
విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీమంత్రి గంటా శ్రీనివాస్ ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. విశాఖపట్నం ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేయడం కలకలం రేపింది. రాజకీయాల్లో తాజా చర్చకు ఆయన కేంద్రబిందువు కావడానికి దారి తీసింది. మొన్నటిదాకా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్న గంటా శ్రీనివాస్ తీసుకున్న ఆ ఒక్క చర్య..అందరి చూపు ఆయన వైపు మళ్లేలా చేసింది.
గంటా బాటలో మరి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు?: రాజీనామాలు వద్దంటోన్న చంద్రబాబు?
వైఎస్ జగన్కు థ్యాంక్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గంటా శ్రీనివాస్ థ్యాంక్స్ చెప్పడం.. రాజీనామా పర్వానికి కొనసాగింపుగా భావిస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా ఉండటానికి, దాన్ని లాభాల్లోకి తీసుకుని రావడానికి అవసరమైన సలహాలు, సూచనలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడాన్ని ఆయన స్వాగతించారు. జగన్ లేఖ రాయడాన్ని తాను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకుని రావడానికి ఆయన చేసిన సూచనలు, సలహాలు విలువైనవిగా పేర్కొన్నారు.
పరిష్కార మార్గాలు చూపారంటూ..
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి ఎలా తీసుకుని రావాలో వైఎస్ జగన్ తన లేఖలో ప్రధానికి సూచించారని చెప్పారు. సొంత ఇనుప ఖనిజం గనులను కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలను ఆయన ప్రధానికి చూపించారని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలను తెలియచేస్తున్నానని చెప్పారు.
అవసరమైతే అఖిలపక్షం..
పెట్టుబడుల ఉపసంహరణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానమని, ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని గంటా శ్రీనివాస్ అన్నారు. ఈ పరిస్థితుల్లో లేఖ రాయడమే కాకుండా.. ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవాలని సూచించారు. వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించి విశాఖ, తెలుగు ప్రజల మనోభావాలను వివరించాలని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం నుంచి ప్రధానిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని కోరుతున్నట్లు తెలిపారు.
రాజీనామా చేసిన మరుసటి రోజే..
తెలుగుదేశం పార్టీ తరఫున తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మరుసటి రోజే గంటా శ్రీనివాస్..వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ విషయంలో ఆయన వైఎస్ జగన్కు తన సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం లేకపొలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. విశాఖపట్నానికి గంటా శ్రీనివాస్ ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నందున.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో జగన్.. ఆయనను కూడా కలుపుకొని వెళ్లొచ్చని, ఇది కాస్తా.. కొన్ని అనూహ్య పరిణామాలకు దారి తీయొచ్చని చెబుతున్నారు.