విశాఖలో ఇంత జరుగుతున్నా కనిపించని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చర్చల్లోకి వచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం విమానాశ్రయంలో అడ్డగించిన ఘటనలో గంటా శ్రీనివాస రావు ఎక్కడా కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య విశాఖ విమానాశ్రయం వద్ద రణరంగం లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అటు వైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశమైంది.

పార్టీకి దూరంగా..
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైనప్పటి నుంచీ గంటా శ్రీనివాస రావు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న సందర్భాలు చాలా పరిమితం. పైగా మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు కూడా. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చుతామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి.

టీడీపీలో కొనసాగుతున్నా..
విశాఖపట్నంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం తప్పు పట్టడంతో ఆయన పార్టీలో ఇమడలకపోతున్నారనే వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. ఒకసారి భారతీయ జనతా పార్టీ వైపు ఇంకోసారి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు సైతం వెలువడ్డాయి. అయినప్పటికీ.. ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదు.

విమానాశ్రయం వద్ద కనిపించని గంటా
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడం, అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకోవడం వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. గో బ్యాక్ బాబు అంటూ వైసీపీ నాయకుల నినాదాలు, టీడీపీ కార్యకర్తల ప్రతిఘటనలు, పోలీసుల తోపులాటలతో విశాఖపట్నం విమానాశ్రయం వద్ద రణరంగం వంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. గంటా జాడ మాత్రం కనిపించలేదు.
Recommended Video


నైతిక మద్దతుగానైనా
చంద్రబాబుపై చోటు చేసుకున్న దాడి పట్ల వర్ల రామయ్య, కూన రవికుమార్ వంటి నాయకులు స్పందించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస రావు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విమానాశ్రయం వద్ద బైఠాయించిన చంద్రబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, పంచుమర్తి అనురాధ వంటి నాయకులకు నైతిక మద్దతు ఇవ్వడానికీ ముందుకు రాలేదు గంటా శ్రీనివాస్. పార్టీ నాయకులు ఆయనకు ఫోన్ చేసినప్పటికీ.. అందుబాటులో లేరని చెబుతున్నారు. దీనితో గంటా శ్రీనివాసరావు వైఖరి మరోసారి తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారైందని అంటున్నారు.












Click it and Unblock the Notifications