పావురాల గుట్టలో పావురం..కోడికత్తి: వైఎస్ మరణంపై అయ్యన్న డౌట్స్: కొడాలి నాని గుడివాడ గొర్రె
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్పై విజయవాడలో చోటు చేసుకున్న దాడి.. రాజకీయంగా దుమారం రేపుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటన అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమౌతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లను రువ్వుకుంటున్నారు.
టీడీపీ నేతల ఎదురుదాడి..
పట్టాభిపై దాడి చేయడం వెనుక తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉందని ఎదురుదాడికి దిగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు ఈ దాడుల నాటకానికి తెర తీశారంటూ వైఎస్సార్సీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలకు ఘాటుగా బదులిస్తోంది టీడీపీ. ఈ వివాదంలో ఏకంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని లాగుతున్నారు ఆ పార్టీ నేతలు. విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు.. ఘాటు పదాలతో వైసీపీ నేతలపై విరచుకుపడ్డారు.
వైఎస్.. తన హెలికాప్టర్ తానే పేల్చుకున్నాడా?
కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లోని పావురాల గుట్టలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో కన్నుమూసిన వైఎస్సార్ను ఆయన ప్రస్తావించారు. పావురాల గుట్టలో వైఎస్సార్ పావురం అయ్యారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ తన హెలికాప్టర్ను తానే పేల్చేసుకున్నారా? అంటూ వైసీపీ నేతలపై కౌంటర్ అటాక్కు దిగారు. పట్టాభి తన మీద తానే దాడి చేసుకున్నారని బులుగు గొర్రెలు మొరుగుతున్నాయని ధ్వజమెత్తారు.
వైఎస్ రాజారెడ్డి ఎలా పోయాడు..
పౌర సరఫరాల శాఖ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని గుడివాడ గొర్రెతో పోల్చారు. గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ ఓ గొర్రెల డాక్టర్ అని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. మరి కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్, బలపనూరులో బడి గంటలు కొడుతూ, బ్రిటీష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేసిన వైఎస్ రాజా రెడ్డి, తన మీద తానే బాంబు వేసుకుని పోయాడా అని ఆయన ప్రశ్నించారు. పావురాలగుట్టలో పావురం అయినోడు, తన హెలికాప్టర్ తానే పేల్చుకున్నాడా? అని నిలదీశారు.
అధికారంలో ఉండి కూడా కోడికత్తిని ఛేదించేలేకపోయారంటూ..
విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో గుచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాల సంగతిఅధికారంలో ఉండి కూడా తేల్చలేకపోతోన్నారని అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, ఇలా గాలి ఏడుపులు ఏడుస్తారు కాబట్టే, వైఎస్సార్సీపీ నాయకులను గాలి మందగా ఫేక్ మందగా అభివర్ణిస్తుంటారని విమర్శించారు. పట్టాభిపై జరిగిన దాడి వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. నిజాలు త్వరలోనే నిగ్గు తేలుతాయని ఆయన అన్నారు.