అల్లు అర్జున్ సోమవారం కోర్టుకు రావాల్సిందే.. నాంపల్లి కోర్టు సంచలనం
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ముంబైలో మూవీ షూటింగ్ లో ఉన్నందున ఆన్ లైన్ విచారణకు హాజరవుతానని అల్లు అర్జున్ కోర్టును అభ్యర్థించారు. అయితే అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆన్ లైన్ విచారణ కుదరదని.. కోర్టుకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో సోమవారం నాంపల్లి కోర్టులో ప్రత్యక్షంగా అల్లు అర్జున్ హాజరుకానున్నారు.
ఏం జరిగింది..?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ మేరకు మూవీ రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే 2024 డిసెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు వేశారు. అయితే ఈ బెనిఫిట్ షో ను చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఫేమస్ సంధ్య థియేటర్ కు వందలాదిగా జనం, ఫ్యాన్స్ వచ్చారు. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ స్వయంగా థియేటర్ కు వస్తున్నారనే సమాచారంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలో థియేటర్ లో భారీ తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేరుస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఇక అల్లు అర్జున్ ను ఏ11గా నమోదు చేసి చార్జ్ షీట్ ను రూపొందించారు.

అయితే ఈ చార్జ్ షీట్ను ఇంతకుముందు కోర్టు మూడుసార్లు తిరిగి పంపింది. అనంతరం తప్పులను సరిచేసిన అధికారులు చివరికి చార్జ్ షీట్ను కోర్టుకు సమర్పించారు. ఇక ఎట్టకేలకు చార్జ్ షీట్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను బట్టి 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. జూన్ 22 సోమవారం నాడు నిందితులంతా తప్పనిసరిగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications