విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యం
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గల్లంతైన వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ ఒడిశాకు చెందిన దినసరి వేతన కూలీలుగా భావిస్తున్నారు. హైదరాబాద్లో లాక్డౌన్ విధించడం వల్ల ఉపాధిని కోల్పోయిన వారందరూ ఒడిశాలోని తమ స్వగ్రామాలకు బయలుదేరారు. ఒడిశా ప్రభుత్వం ఏపీతో సరిహద్దులను మూసివేయడం వల్ల వారంతా పడవల ద్వారా స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చని భావిస్తున్నారు. రైలులో విశాఖపట్నం వరకు చేరుకుని, పడవల్లో సీలేరు నదిని దాటుకుని ఒడిశాకు బయలుదేరి ఉంటారని తెలుస్తోంది.

విశాఖపట్నం నుంచి ఆటోల్లో సీలేరుకు చేరుకున్న వారందరూ సీలేరును దాటడానికి నాటు పడవలను ఆశ్రయించారు. అద్దెకు రెండు నాటు పడవలను మాట్లాడుకున్నారు. వాటి ద్వారా ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఈ రెండు నాటుపడవల్లో 11 మంది వరకు ఉన్నట్లు భావిిస్తున్నారు. చీకటి కావడం వల్ల పడవలు అదుపు తప్పి ఢీ కొట్టుకుని ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు.
Recommended Video
గల్లంతైన కూలీలందరూ మల్కాన్గిరి జిల్లా ఏజెన్సీ గ్రామాలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. ముందుగా వెళ్తున్న నాటుపడవ.. అదుపు తప్పి నీట మునిగిందని.. దాన్ని అనుసరిస్తూ వచ్చిన మరో నాటుపడవ దాన్ని ఢీకొట్టిందని ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఓ చిన్నారి మృతదేహం లభించింది.












Click it and Unblock the Notifications