visakhapatnam: మరో ప్రమాదం -APEPDCL సింహాచలం సబ్స్టేషన్లో పేలుడు -తప్పిన ముప్పు
ఆంధ్రప్రదేశ్ భావి రాజధాని విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఈ వారంలోనే వరుసగా మూడు పెద్ద సంఘటనలు జరిగాయి. మొన్న పరవాడ ప్రాంతంలో అనన్య అమ్మోనియా కంపెనీ నుంచి గ్యాస్ లీకేజీ.. నిన్న హిందూస్ధాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కు చెందిన ఓల్డ్ టెర్మినల్ లో భారీ అగ్నప్రమాదం చోటుచేసుకోగా, తాజాగా ఏపీ విద్యుత్ శాఖకు చెందిన సబ్ స్టేషన్ లో ట్రాన్స్ ఫార్మర్ పేలుడు సంభవించింది. మూడు ఘటనల్లోనూ ప్రాణనష్టం తప్పినా భారీగా ఆస్తినష్టం జరిగింది. వివరాలివి..
విశాఖ నగరంలోని సింహాచలం-ఆర్ఆర్ వెంకటాపురం ట్రాన్స్కో విద్యుత్ సబ్ స్టేషన్లో 10/ 16 ట్రాన్స్ఫార్మర్ అగ్నిప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్లు ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్ధాలతో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఏర్పడింది. దీంతో రాత్రిపూట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సింహాచలం సబ్స్టేషన్లో ఒక ట్రాన్స్ ఫార్మర్ పేలిపోగా, ఆ మంటలు మిగిలిన ట్రాన్స్ఫార్మర్లకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు సరఫరాను నిలిపేయడంతో పెను ముప్పు తప్పినట్లయింది. సిబ్బంది సమయానుకూలంగా స్పందించకుంటే మిగత ట్రాన్స్ ఫార్మర్లూ పేలి ఉంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

ప్రమాదానికి గురైన ట్రాన్స్ఫార్మర్ 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మిగిలిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రతాప్ తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణం, నష్టం అంచనా వేయడానికి అధికారుల బృందం దర్యాప్తు చేసి నిర్ధరిస్తుంందని ఆయన చెప్పారు.













Click it and Unblock the Notifications