విశాఖ లీకేజీ: విస్పోటనం తప్పదా?.. వచ్చే 10 రోజులు భయానకం.. ప్రాణాలకు పూచీ ఉందా?
''నిత్యం ప్రమాదకర రసాయనాలతో పనిచేసే మమ్మల్ని కూడా అత్యవసర సేవల విభాగంలో చేర్చండి.. భారీ బాయిలర్లు కలిగిన కెమెకల్ ఫ్యాక్టరీల్లో రోజువారీ పనులే కత్తిమీద సాములా చేస్తుంటాం.. వాటిని ఎప్పుడుపడితే అప్పుడు మూసేసి, కావాలనుకున్నప్పుడు ఆన్ చేసే పరిస్థితి ఉండదు.. రోజుల పాటు ప్లాంట్లను మూసేస్తే పెను ప్రమాదాలు చవిచూడాల్సి వస్తుంది.. అసలే ఇది విషవాయువులతో వ్యవహారం.. కాబట్టి కనీసం 50 శాతం ఆపరేషన్స్ నిర్వహించుకునేందుకైనా అనుమతివ్వండి..'' అంటూ ఇండియన్ కెమెకల్ కౌన్సిల్(ఐసీసీ) గత నెలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కతీరుగా వేడుకుంది. సీన్ కట్ చేస్తే..

విశాఖలో ఘోరం..
వైజాగ్ సిటీ శివారు ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో విషపూరిత ‘స్టెరీన్' గ్యాస్ లీక్ కావడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ఆస్పత్రులపాలయ్యారు. వందలాది మూగజీవాలు విగతజీవులైపోయాయి. ప్రమాదఘటనపై స్థానిక యువత, పోలీసులు, ప్రభుత్వం సకాలంలో స్పందించి, ఆ ప్లాంట్ చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయించడంతో తక్కువ నష్టంతో బయటపడగలిగాం. ప్రస్తుతానికి విశాఖకు మాత్రం పెనుముప్పు తప్పినా.. దేశంలోని ఇతర కెమికల్, ప్లాస్టిక్ కంపెనీల సేఫ్టీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ సంస్థ చెబుతున్న కారణాలు భయాన్ని రెట్టింపు చేసేలా ఉన్నాయి.

ఇద్దరి కీలక వివరణలు..
‘‘లాక్ డౌన్ కారణంగా ప్లాంట్ ను తాత్కాలికంగా మూసేశాం. 40 రోజులుగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. గ్రీన్ జోన్లలో అన్ని రకాల పరిశ్రమలు తెరుచుకోవచ్చన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాంటును తిరిగి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నాం. తెల్లవారుజామున ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టు నైట్ షిఫ్ట్ లో పనిచేసిన కార్మికుడొకరు గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యాం'' అని ఎల్జీ పాలిమర్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించేసరికి, అప్పటికే ట్యాంకుల్లో మిగిలిపోయిన గ్యాస్ ను తొలగించడం వీలుకాలేదని, కెమికల్ రియాక్షన్ కారణంగా అది వేడెక్కి, లీకైనట్లు నిపుణులు చెబుతున్నారని పోలీసులు వివరించారు. ఈ రెండు వివరణల్లోనూ ప్రమాదానికి లాక్ డౌన్ కూడా ఓ కారణమనే భావన ధ్వనించింది.

విస్పోటం తప్పదా?
ఇప్పుడు మనం పై పేరాలో చదువుకున్న ఇండియన్ కెమెకల్ కౌన్సిల్(ఐసీసీ) ఆవేదనను మళ్లీ గుర్తుచేసుకుందాం. మన దేశంలో 80వేల రకాల కెమికల్, ప్లాస్టిక్ ఉత్పత్తులు నిరంతరం తయారవుతుంటాయి. కెమికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే టాప్-6వ స్థానంలో ఉంది. ఫార్మాసిటికల్స్ కాకుండా అచ్చంగా కెమికల్స్ ఎగుమతుల్లో 14వ స్థానం, దిగుమతుల్లో 8వ స్థానంలో భారత్ ఉంది. ‘ఎల్జీ పాలిమర్స్' లాంటి బడా కార్పొరేట్లు మొదలుకొని చిన్నతరహా ప్లాస్టిక్ తయారీ కంపెనీల దాకా మన దగ్గర ప్లాంట్ల సంఖ్య వేలల్లో ఉంది. అవన్నీ గత 45 రోజులుగా మూతపడి ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపుల కారణంగా రాబోయే 10 రోజుల్లో చాలా చోట్ల ఫ్యాక్టరీలు రీఓపెన్ కానున్నవేళ.. విశాఖ లాంటి పరిస్థితులే తలెత్తితే విషవాయువుల విస్పోటనానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.

ఇది ట్రైలర్ మాత్రమే..
విశాఖ ఎల్జీ ప్లాంటులో స్టెరీన్ గ్యాస్ లీకేజీ ఇంకా అదుపులోకి రాకముందే.. ఛత్తీస్గఢ్ లోని రాయ్ గఢ్ జిల్లాలో ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ ప్రమాదం సంభవించింది. సరిగ్గా విశాఖలాగే రాయ్ గఢ్ లోనూ లాక్ డౌన్ సడలింపుల తర్వాతే పేపర్ ప్లాంటును రీఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ట్యాంకులో విషవాయువు లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదకర రసాయనాలతో పనిచేసే ఫ్యాక్టరీల్ని అర్ధాంతరంగా మూసేస్తే ఏం జరుగుతుంతో ఐసీసీ చెప్పినట్లే వరుస ఘటనలు నిరూపించాయి. ఇది ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఘటనలు చూడబోతున్నామని కెమికల్ ఇండస్ట్రీవర్గాలు హెచ్చరిస్తున్నాయి.

తప్పు సరిదిద్దుకుంటారా?
కెమికల్, ప్లాస్టిక్ కంపెనీల మూసి వేత విషయంలో కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలేవీ జారీ చేయకపోవడం దేశానికి శాపంగా మారింది. అత్యవసర సేవల కింద ఫార్మా, ఫుడ్, ఆగ్రో కంపెనీలు మాత్రమే పనిచేసుకోవచ్చన్న కేంద్రం.. మధ్యతరహా, భారీ కెమికల్, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల విషయంలో నిర్లక్ష్యం వహిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన ప్రమాదాలకు కేంద్రం బాధ్యత వహిస్తుందా? రాష్ట్రాలపైకే నెట్టేస్తుందా? అనేది ఇంకా తేలాల్సిఉంది. అయితే లాక్ డౌన్ గడువు మే 17తో ముగుస్తుండటంతో ఇప్పటికైనా ఆయా కెమికల్, ప్లాస్టిక్ ప్లాంటుల రీఓపెనింగ్ పై స్పష్టమైన గైడ్ లైన్స్ రూపొందించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
Recommended Video

ఇవీ మన కెమికల్ లెక్కలు..
కెమికల్ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో భారత్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. గ్లోబల్ కెమికల్ ఇండస్ట్రీలో మన వాట 3శాతంగా ఉంది. పాలిమర్స్ వాడకంలో మనం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాం. మన కెమికల్ ఇండస్ట్రీ విలువ 2025నాటికి 304బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. వచ్చే ఐదేళ్లలో మన దగ్గర కెమికల్ ప్రాడక్ట్స్ కు డిమాండ్ మరో 9 శాతం పెరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా రెండు కోట్ల పైచిలుకు మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు.












Click it and Unblock the Notifications