వైసీపీకి స్టీల్ ప్లాంట్ సెగ-విశాఖ ఎంపీని ఘోరావ్ చేసిన కార్మికులు-ఉద్యమానికి 200 రోజులు
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ మొదలైన ఉద్యమం 200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ఇవాళ కార్మికుల నిరసనల సెగ స్ధానిక వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను సైతం తాకింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా 10 కిలోమీటర్ల పాటు పది వేల మంది మానవహారం చేపట్టి తమ నిరసన తెలిపారు. ఇవాళ కూడా కార్మికులు పలు చోట్ల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో వారిని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ స్ధానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కూడా వీరి నిరసన సెగ తాకింది. స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపిస్తూ కార్మికులు ఆయన్ను చుట్టు ముట్టారు. దీంతో ఆయన వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

వైసీపీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్మికుల నిరసనల మధ్యే కారులోకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన్వు అడ్డుకునేందుకు కార్మికులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన గన్ మెన్ల సాయంతో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వందలాదిగా తరలివచ్చిన కార్మికులు ఆయన కారును కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎలాగోలా ఎంపీ సత్యనారాయణ అక్కడి నుంచి బయడపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై కార్మిక సంఘాలు ఇప్పటికే తమ నిరసనలు తెలుపుతున్నాయి.
వైసీపీకి స్టీల్ ప్లాంట్ సెగ-విశాఖ ఎంపీని ఘోరావ్ చేసిన కార్మికులు-ఉద్యమానికి 200 రోజులు#Vizag #Vizagsteelpant #Ysrcp pic.twitter.com/VTo9lH9O1K
— oneindiatelugu (@oneindiatelugu) August 30, 2021
మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. ఉక్కు దిగ్గజాలైన టాటా స్టీల్ తో పాటు మిట్టల్ గ్రూప్ కూడా దీన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని ఎలాగైనా అడ్డుకుంటామని, స్టీల్ ప్లాంట్ కొనేందుకు వచ్చే వారిని ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయినా కేంద్రం ఇవేవీ పట్టనట్టుగా తమ పని తాము చేసుకుపోతోంది.












Click it and Unblock the Notifications