దళితుడినని తొక్కేస్తున్నారు ... విడదల రజనీ బాటలో సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. నిన్నటికి నిన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని సొంత పార్టీ నేతలు తనను వెన్నుపోటు పొడుస్తున్నారు అని, వారి అంతు చూస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

సొంతపార్టీ నేతల తీరుపై ఆక్రోశం వెళ్ళగక్కిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
మొన్న చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండగానే విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సొంత పార్టీ నేతల పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి. అధికార పార్టీలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ఆధిపత్య పోరును బట్టబయలు చేస్తున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా దళితుడినని తనను హేళన చేస్తున్నారని, అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలు తనను చులకనగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పాయకరావుపేటలో గొల్ల బాబూరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

దళితుడిననే హేళన అన్న ఎమ్మెల్యే
అంటరానితనం ఉండకూడదని గాంధీజీ కోరుకున్నారని కానీ నేటి సమాజంలో దళితుల పట్ల అంటరానితనం, కులవివక్ష అలాగే ఉన్నాయని ఎమ్మెల్యే బాబూరావు అభిప్రాయపడ్డారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనపై నేటికీ వివక్ష చూపుతున్నారని ఆయన వాపోయారు. దళితుడిని అన్న కారణంగా తనను చులకనగా చూస్తూ, హేళన చేస్తూ తనను రాజకీయంగా పైకి ఎదగనివ్వడంలేదని గొల్ల బాబూ రావు పేర్కొన్నారు.

తొక్కెయ్యాలని చూస్తున్నారని ఆవేదన
ఇక ఈ వివక్ష వల్లే తాను అభివృద్ధి చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన సొంత పార్టీ నేతలే తనను తొక్కేయాలని చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో 73 ఏళ్లు గడిచినా ఇప్పటికి అంటరానితనం, వివక్ష దళితులపై పోవడం లేదన్న పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు ఎమ్మెల్యే అయినా తనపైనే ఇంతలా వివక్ష కొనసాగుతుంటే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

కార్యక్రమాలలో వేదికల మీద తనఫోతో చిన్నది పెడుతున్నారని ఆరోపణ
ఇక తనపై వివక్ష ఎంతలా ఉందో చెప్పిన ఆయన ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు వేదికపై వారి ఫోటోలు పెద్దగానూ ,తన ఫొటో చిన్నగానూ పెడుతున్నారని ఎమ్మెల్యే బాబూరావు అసంతృప్తి వ్యక్తం చేశారు . ఇది వివక్ష కాదా అంటూ సొంత పార్టీ నేతలనే ప్రశ్నించారు. గొల్ల బాబూరావు ఊహించని విధంగా చేసిన వ్యాఖ్యలు స్థానిక నేతలను షాక్ కు గురి చేశాయి. ప్రస్తుతం ఏపీలో బాబూరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.












Click it and Unblock the Notifications