భవిష్యత్ రాజధానిగా తొలి అడుగు: విశాఖకు జగన్: 25 వేల మంది వలంటీర్లతో భారీ కార్యక్రమం
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ విశాఖపట్నం వెళ్లనున్నారు. జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పార్లె ఇండియా తలపెట్టిన కార్యక్రమం ఇది. 25 వేల మంది వలంటీర్లు ఇందులో పాల్గొనబోతోన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం బీచ్ను క్లీన్ చేయనున్నారు.
29 కిలోమీటర్ల దూరం..
పార్లె ఫర్ ది ఓషన్స్ పేరుతో పార్లె ఇండియా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. తీర ప్రాంతాలను శుభ్రం చేయాలనే ఉద్దేశంతో పార్లె ఇండియా దీన్ని నిర్వహిస్తోంది. విశాఖపట్నంలో 29 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతంలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించనుంది ఈ కార్యక్రమం ద్వారా. దీన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం, జీవీఎఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటికే వలంటీర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.
40 జోన్లుగా..
విశాఖపట్నంలో నావల్ కోస్టల్ బ్యాటరీ వద్ద నుంచి భీమిలీ బీచ్ వరకు సుమారు 29 కిలోమీటర్ల మేర తీర ప్రాంతాన్ని వలంటీర్లు శుభ్రం చేయనున్నారు. ఈ 29 కిలోమీటర్ల దూరాన్ని 40 జోన్లుగా విభజించారు అధికారులు. ఒక్కో జోన్లో 500 నుంచి 600 మంది వలంటీర్లను మోహరింపజేస్తారు. సందర్శకుల తాకిడి అధికంగా ఉండే జోన్లల్లో సహజంగానే చెత్త అధికంగా ఉంటుంది. అలాంటి చోట అవసరాన్ని బట్టి 1,000 వరకు వలంటీర్లను నియమిస్తారు.

స్వచ్ఛందంగా..
జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం, ఈస్టర్న్ నావల్ కమాండ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు, వైజాగ్ బీచ్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా తెలిపారు. వలంటీర్లందరికీ శానిటరీ గ్లోవ్స్, టీషర్ట్స్, మంచినీరు, ట్రాష్ బ్యాగ్స్ అందజేస్తామని అన్నారు. మెడికల్ టీమ్ అందుబాటులో ఉంచామని చెప్పారు.
ముంబై తరహాలో..
ముంబై తరహాలో విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ చెబుతూ వస్తోంది. అందుకే ఈ సాగర నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించాలని వైఎస్ జగన్ నిర్ణయించారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. 29 కిలోమీటర్ల పొడవు ఉన్న అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.

భవిష్య రాజధానిగా..
ఈ నేపథ్యంలో పార్లె ఇండియా వంటి ఎంఎన్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ భవిష్య రాజధానిగా జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకుని రావడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications