విశాఖపట్నానికి వైఎస్ జగన్: ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన సాగర నగరానికి రానున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఆరంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. 11వ తేదీన పూర్ణాహూతి కార్యక్రమంలో వార్షికత్సవం ముగుస్తుంది.
స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి, ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందులో కీలకమైనవి రాజశ్యామల యాగం, రుద్రయాగం, అగ్నిహోత్ర సభ. ఈ నెల 9వ తేదీన దీన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. కిందటి నెల 5వ తేదీన స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనాలంటూ ఆహ్వానించారు.

ఈ ఆహ్వానం మేరకు వైఎస్ జగన్ 9వ తేదీన విశాఖకు రానున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి వస్తారు. రాజశ్యామల యాగం, రుద్రయాగంలో పాల్గొంటారు. అగ్నిహోత్ర సభకు హాజరవుతారు. స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే శారదా పీఠాన్ని సందర్శించారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. ఇదివరకు కూడా పీఠం వార్షికోత్సవాలకు ఆయన హాజరయ్యారు. స్వరూపానందేంద్ర సరస్వతి.. పలు అంశాల్లో జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలన వ్యవహారాలపైనా ప్రశంసలు కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ మరింత సమర్థవంతంగా పని చేస్తోందంటూ కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications