అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం- లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు- జగన్ ఆరా
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. పాడేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

జిల్లా కేంద్రం పాడేరు సమీపంలో గల ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం సంభవించింది. సుమారు 60 మంది ప్రయాణికులతో పాడేరు నుంచి బయలుదేరిన ఈ బస్సు చోడవరం చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. పాడేరు వ్యూ పాయింట్ వద్ద మలుపులో అదుపు తప్పి పక్కనే ఉన్న 100 అడుగుల లోయలో పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులు 108 అంబులెన్స్, పాడేరు పోలీసులకూ సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.

మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం పాడేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. లోయలో పడ్డ బస్సులో నుంచి గాయపడ్డ వారిని వెలికి తీయడానికి ప్రత్యేక చర్యలను తీసుకుంటోన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. క్షతగాత్రులకు నాణ్యమైన చికిత్స అందజేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications